మధుమేహం - సీతాఫలం !

Telugu Lo Computer
0


సీతాఫలం కొండల్లో, కోనల్లో, డొంకల్లో ఈ చెట్లు సులభంగా పెరుగుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వీటిని అమిత ఇష్టంగా తింటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ బి6, కాల్షియం వంటివి ఉంటాయి. అయితే మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినకూడదని అంటుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం  డయాబెటిస్ ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా సీతాఫలాన్ని తినొచ్చని చెబుతున్నారు. ఈ పండ్లను తిన్నా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవంటున్నారు. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 54 మాత్రమే. ఇందులోని పీచు గ్లూకోజ్‌ను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్‌ వాళ్లు మితంగా తినొచ్చనీ, ఇది ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి, గుండెకి మేలు చేస్తుందనీ నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌-ఎ, సిలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండులోని పీచు మలబద్ధకాన్నీ ఇతరత్రా జీర్ణసమస్యల్నీ దూరం చేస్తుంది. నియాసిన్‌ చెడు కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుంది. సీతాఫలాల్లో పాలీ ఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి, గ్లూకోజ్ శోషణను బాగా పెంచుతాయి. దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది. 100 గ్రాములసీతాఫలంలో 20 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఇనుము ఇన్సులిన్ ఉత్పత్తిని పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.అంతే కాకుండా సీతాఫలంలోని బులటాసిన్‌, అసిమిసిన్‌ అనే ఫ్లేవనాయిడ్లకు క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉన్నాయనీ, ఆల్కలాయిడ్లూ ఎసిటోజెనిన్‌లు మూత్రపిండ వ్యాధుల్ని తగ్గిస్తాయని పరిశోధనలూ చెబుతున్నాయి. మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉండే సీతాఫలం ఎముక పుష్టినీ పెంచుతుంది. కాబట్టి ఆర్ధ్రయిటిస్‌ వాళ్లకీ ఈ పండు మేలే. చర్మ సమస్యలకు ఇది మంచి మందు. పచ్చికాయల్ని దంచి ఉప్పువేసి పుండ్లూ గడ్డలమీద పెట్టినా తగ్గుతాయి అంటారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)