సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించేలా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ సరికొత్త విధానాన్ని అమలుచేసేలా వ్యూహరచన చేయాలని సీబీఎస్ఈని కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పరీక్షల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని సమాచారం. ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చే నెలలోనే సంప్రదింపులు జరపనున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల షెడ్యూల్పై ఎలాంటి ప్రభావం లేకుండా రెండోసారి బోర్డు పరీక్షలు నిర్వహించేలా అకడమిక్ క్యాలెండర్ను సిద్ధం చేసేందుకు విధివిధానాలు రూపొందించే పనిలో సీబీఎస్ఈ అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సీబీఎస్ఈ పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్వర్క్ (NCF) ముసాయిదా కమిటీ సూచించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ కె.కస్తూరిరంగన్ సారథ్యంలోని ఈ కమిటీ 11, 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్ని కూడా ప్రతిపాదించింది. ఈ ఫ్రేమ్వర్క్ను గతేడాది ఆగస్టులో కేంద్ర విద్యామంత్రిత్వశాఖ విడుదల చేసింది.
2025 నుంచి ఏడాదికి 'రెండుసార్లు' సీబీఎస్ఈ పరీక్షలు ?
April 26, 2024
0
Tags