లోక్సభ, రాజ్యసభ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూలై 18 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు సభ్యులు వీడ్కోలు పలికారు. అనంతరం కేంద్రీయ విశ్వవిద్యాలయాల బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అనంతరం రాజ్యసభను ఉప సభాపతి హరివంశ్ నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. లోక్ సభ కూడా వాయిదా పడింది. ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగాల్సి ఉన్నప్పటికీ నేటితో వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో భాగంగా లోక్సభలో పలువురు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దేశంలో నెల కొన్న పరిణామాలతో వాడీవేడిగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగాయి. ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, నిరుద్యోగం, అగ్నిపథ్ పథకం, ధరల పెరుగుదల, జీఎస్టీ పరిహారం పెంపు, దేశంలో పెరిగిపోయిన మత విద్వేషాలు, రాజ్యాంగ వ్యవస్థల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, భారత్ చైనా సరిహద్దు వివాదం వంటి అంశాలపై కేంద్రాన్ని విపక్షాలు నిలదీశాయి.
పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా
August 08, 2022
0
Tags