అసోంకు 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ యాత్రకు సంబంధించి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసోంలోని సునీత్పూర్ జిల్లా జుముగురిహాట్ వద్ద కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కారుపై కొందరు వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. దాడి చేసినవారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అంతేకాదు జైరాం రమేష్ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సునీత్పూర్లోని జుముగురిహత్లో తన వాహనంపై బీజేపీ గుంపు దాడి చేసిందని జైరాం రమేష్ అన్నారు. వారు విండ్షీల్డ్పై ఉన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లను కూడా చించివేశారని తెలిపారు. నీళ్లు చల్లి నినాదాలు చేశారని అన్నారు. కానీ తాము సంయమనాన్ని పాటించామని వారికి చేతులు ఊపుతూ వేగంగా ముందుకు సాగామని చెప్పారు. అంతేకాదు ఈ దాడిని అసోం రాష్ట్ర సీఎం నిర్వహించారని దీనికి తాము భయపడబోమని జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఈ దాడి తర్వాత మేము పోలీసులకు సమాచారం ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ కమిటీ సభ్యుడు మహిమా సింగ్ తెలిపారు. దాడి చేసిన వ్యక్తులు వాహనంపై ఉన్న స్టిక్కర్లను చింపి, దానిపై బీజేపీ జెండాను కూడా ఉంచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీంతో కారు వెనుక అద్దాలు దాదాపు పగిలిపోయాయని అన్నారు. యాత్రను కవర్ చేస్తున్న వ్లాగర్ కెమెరా, బ్యాడ్జ్, ఇతర సామగ్రిని లాక్కున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
జైరాం రమేష్ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి
January 21, 2024
0
Tags