ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం శబరి ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకోగా.. అదే స్థాయిలో ఆదాయం చేకూరింది. ఈ ఏడాదికి(2024) గాను మండల, మకరవిలక్కు పూజలు సమాప్తం అయ్యాయి. జనవరి 21 ఉదయం 5.30సమయంలో ప్రత్యేకపూజలు చేసి ఆపై అయ్యప్ప ఆలయం మూసివేశారు అధికారులు. శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్లో భక్తులు పోటెత్తారు. రోజుకు సుమారు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. తక్కువలో తక్కువగా సుమారు 15 గంటలకు పైగా స్వామి దర్శనం కోసం వెయిట్ చేశారు అయ్యప్పలు. ఈ ఏడాది 50 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. గత ఏడాది ఈ సంఖ్య 44 లక్షలుగా ఉండగా.. టోకెన్లు, స్లాట్ సిస్టమ్, ఆంక్షలున్నా గతేడాదికంటే 6లక్షల మంది అదనం వచ్చినట్లు చెప్పారు అధికారులు. 41 రోజుల పాటు సాగిన మండల-మకరవిళక్కు సీజన్ ముగియడంతో శబరిమల ఆలయాన్నిమూసివేశారు. అయితే శబరిమలలో పోటెత్తిన భక్తుల రద్దీతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కొంతమంది భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగారు. ఈ ఏడాది 357 కోట్ల 47లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది ట్రావెన్కోర్. గతేడాదితో పోల్చితే దాదాపు పదికోట్లు అదనపు ఆదాయం అయ్యప్ప ఆలయానికి వచ్చినట్లు చెప్పారు అధికారులు. సీజన్కు 7 నెలల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించినట్లు TDB తెలిపింది. స్వార్థ ప్రయోజనాలతో కొందరు పాదయాత్రకు సంబంధించి తప్పుడు సమాచారం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే పాదయాత్ర సజావుగా సాగిందన్నారు. జనవరి 15న మకరవిళక్కు ఉత్సవం.. శుక్రవారం మలికప్పురం ఆలయంలో గురుతి నిర్వహించారు.
శబరిమల ఆలయం మూసివేత
January 21, 2024
0
Tags