డిసెంబర్ 3 తర్వాత రాజస్థాన్ లో కాంగ్రెస్ కనుమరుగవుతుంది !

Telugu Lo Computer
0


రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భరత్‌పుర్‌లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అడుగుపెడుతుందో అక్కడ నేరాలు, అవినీతి రాజ్యమేలుతాయని ఆరోపణలు చేశారు. ఓవైపు భారత్ ఈ ప్రపంచానికి ఒక నాయకుడిలా ఎదిగితే, రాజస్థాన్‌లో మాత్రం అవినీతి, అల్లర్లు, నేరాలు పెచ్చుమీరిపోయాయని పేర్కొన్నారు. డిసెంబర్ 3వ తేదీన రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ని ప్రధాని మోడీ టార్గెట్ చేస్తూ ''మంత్రగాడు అయిన అశోక్ గెహ్లాట్‌కు ఓటు వేయకూడదని రాజస్థాన్ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి మాయమవుతుంది. ఏ విధంగా ఒక మంత్రగాడు తన మ్యాజిక్ ట్రిక్స్‌తో వస్తువుల్ని మాయం చేస్తాడో, అలాగే రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ కనుమరుగవుతుంది. ఒకవైపు భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతుంటే మరోవైపు రాజస్థాన్‌ రాష్ట్రాన్ని గత ఐదేళ్లలో అవినీతి, అల్లర్లు, నేరాల్లో కాంగ్రెస్ అగ్రగామిగా నిలిపింది. అందుకే రాజస్థాన్ మాంత్రికుడు గెహ్లాట్‌కు ఈసారి ఓట్లు పడవని రాజస్థాన్ ప్రజలు చెప్తున్నారు'' అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా తన బుజ్జగింపు విధానాలతో ఉగ్రవాదులు, నేరస్థులు, అల్లరిమూకలకు స్వేచ్ఛనిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. తన స్వలాభం కోసం రాజస్థాన్ ప్రజల్ని పణంగా పెట్టడానికి కూడా కాంగ్రెస్ వెనుకాడదని అన్నారు. కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో మహిళలు, దళితులపై అత్యధికంగా నేరాలు జరిగాయని పేర్కొన్నారు. అల్లర్లు, రాళ్ల దాడి, కర్ఫ్యూల కారణంగా.. రాజస్థాన్ రాష్ట్ర ప్రజలు హోలీ, రామ నవమి, హనుమాన్ జయంతి వంటి పండగలను శాంతియుతంగా జరుపుకోలేకపోయారన్నారు. రాజస్థాన్‌ మహిళల విశ్వాసాన్ని సైతం కాంగ్రెస్ వమ్ము చేసిందని ప్రధాని పేర్కొన్నారు. మహిళలు తప్పుడు అత్యాచార కేసులు పెడతారని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అంటున్నారని అలాంటి వ్యక్తి మహిళలకు రక్షణ కల్పించగలడా? అని ప్రధాని మోడీ ప్రశ్నించారు. అటువంటి వ్యక్తికి ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే హక్కుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో గందరగోళ వాతావరణం నెలకొందని, ప్రశాంతత లేకుండా పోయిందని అందుకే రాష్ట్ర ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కి ఓటు వేయకూడదని నిర్ణయించారని ప్రధాని మోడీ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)