తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సెంథిల్ బాలాజీ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చారు. ఇప్పటికే పిటిషనర్ సోదరుడు పరారీలో ఉండడం, బెయిల్ ఇస్తే బాలాజీ సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉండడంతో చివరకు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో అన్నాడీఎంకే హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ.. ఆ సమయంలో ఉద్యోగాల విషయంలో నగదు కుంభకోణానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. దీంతో ఉద్యోగాల విషయంలో నగదు కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జూన్ 14న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాలాజీని అరెస్టు చేసింది. అరెస్ట్ చేసిన వెంటనే ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. కావేరి ఆసుపత్రిలో బాలాజీకి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. అనంతరం జూలై 17న పుఝుల్ సెంట్రల్ జైలులోని జైలు ఆసుపత్రికి తరలించారు.
సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
October 19, 2023
0
Tags