అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తిరిగి ఇవ్వనున్న బ్యాంకులు !

Telugu Lo Computer
0


అకౌంట్‌లో మీ డబ్బులు అలాగే ఉన్నాయా? లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్  చేసి మర్చిపోయారా? ఇలా బ్యాంకులో మీరు ఏరకంగా మర్చిపోయిన డబ్బులైనా సరే బ్యాంకులు వెనక్కి ఇచ్చేయనున్నాయి. బ్యాంకు ఖాతాల్లో ఇలా మర్చిపోయిన డబ్బుల్ని, ఎవరూ క్లెయిమ్ చేయని నగదును అన్‌క్లెయిమ్డ్ అమౌంట్‌గా గుర్తిస్తాయి బ్యాంకులు. ఈ డబ్బులపై సదరు ఖాతాదారులకే హక్కు ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల బ్యాంక్ అకౌంట్‌లో లేదా డిపాజిట్ అకౌంట్‌లో డబ్బులు మర్చిపోతుంటారు. ఇలా తమకు చెందిన డబ్బుల్ని క్లెయిమ్ చేయనివారికి బ్యాంకులు పిలిచిమరీ డబ్బులు వెనక్కి ఇవ్వబోతున్నాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. దేశంలోని ప్రతీ జిల్లాలో బ్యాంకులు తమ టాప్ 100 డిపాజిట్లను ట్రేస్ చేసి సెటిల్ చేసేందుకు ప్రత్యేకంగా 100 రోజుల ప్రచారాన్ని నిర్వహించబోతోంది ఆర్‌బీఐ. ఈ ప్రచార కార్యక్రమం జూన్ 1న ప్రారంభం కానుంది. 10 సంవత్సరాల పాటు నిర్వహించబడని సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్‌లోని బ్యాలెన్స్ లేదా మెచ్యూరిటీ తేదీ నుంచి 10 సంవత్సరాలలోపు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను "అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు"గా గుర్తిస్తాయి బ్యాంకులు. ఎవరూ క్లెయిమ్ చేయని నగదును బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న "డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్" ఫండ్‌కి బదిలీ చేస్తాయి. అయితే అంతకన్నా ముందు సదరు డిపాజిట్ హోల్డర్స్ లేదా అకౌంట్ హోల్డర్స్‌ల వివరాలు సేకరించే వారిని కాంటాక్ట్ చేయబోతున్నాయి బ్యాంకులు. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించడానికి, అటువంటి డిపాజిట్లను నిజమైన యజమానులకు లేదా క్లెయిమ్‌దారులకు తిరిగి ఇవ్వడానికి ఆర్‌బీఐ చేపట్టిన ప్రయత్నాల్లో ఈ క్యాంపైన్ ఒకటి. ఇటీవల ఆర్‌బీఐ అనేక బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను గుర్తించడానికి కేంద్రీకృత వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సామాన్య ప్రజలు కూడా ఈ పోర్టల్ యాక్సెస్ చేయొచ్చు. ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు తాము క్లెయిమ్ చేయని నగదును గుర్తించి, సంబంధిత బ్యాంకును ఆశ్రయించేలా చర్యలు తీసుకుంటోంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో ప్రజలు తాము క్లెయిమ్ చేయని డిపాజిట్లను తిరిగిపొందడంలో సహాయపడటానికి ఒక డ్రైవ్‌ను ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్న సంగతి తెలిసిందే. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిర్వహించబడని డిపాజిట్‌లకు సంబంధించి ఫిబ్రవరి 2023 నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్‌లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఆర్‌బీఐకి బదిలీ చేయబడ్డాయి. ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు సుమారు 10.24 కోట్ల ఖాతాలకు చెందినవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.8,086 కోట్ల విలువైన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లతో అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 5,340 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 3,904 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)