కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దావణగెరెకి ఓ ప్రత్యేకత దక్కింది. దావణగెరె దక్షిణ, దావణగెరె ఉత్తర అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే విజయం సాధించారు. పక్కపక్క నియోజక వర్గాల్లో ఒకే పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ నియోజక వర్గాల్లో పోటీ చేసిన తండ్రీ కొడుకు విజయం సాధించడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనింది. దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శామనూరు శివ శంకరప్ప పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మీద 83, 839 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శామనూరు శివశంకరప్ప కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. 90 ఏళ్లు దాటినా ఎంతో హుషారుగా ఉండే శామనూరు శివ శంకరప్పకు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో ఆయన మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక దావణగెరె ఉత్తర అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ శామనూరు శివ శంకరప్ప కుమారుడు ఎస్ఎస్. మల్లికార్జున్ కు ఇచ్చారు. తండ్రి కొడుకులు పక్కపక్క నియోజక వర్గాల్లో పోటీ చేశారు. ఎస్ఎస్ మల్లికార్జున్ కూడా 78, 345 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మీద విజయం సాధించారు. తండ్రీ కొడుకులు శామనూరు శివశంకరప్ప, ఎస్ఎస్ మల్లికార్జున్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో దావణగెరెలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేసారి తండ్రీ కొడుకులు విజయం సాధించడంతో దావణగెరె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
దావణగెరెలో తండ్రీకొడుకుల గెలుపు !
May 13, 2023
0
Tags