నితీశ్, మమతలపై మండిపడ్డ ఓవైసీ !

Telugu Lo Computer
0


శ్రీరామ నవమి శోభాయాత్రల సందర్భంగా పశ్చిమ బెంగాల్, బీహార్‌ రాష్ట్రాల్లో చెలరేగిన అల్లర్లు, హింసాకాండపై ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసద్దుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏళ్ల తరబడి ముఖ్యమంత్రులుగా ఉన్న నితీశ్ కుమార్, మమతా బెనర్జీలకు శాంతి భద్రతలను కాపాడటం ఆమాత్రం చాతకాదా అంటూ నిప్పులు చెరిగారు. శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఓవైసీ అన్నారు. ఈ విషయమై మంగళవారం ఆయన మాట్లాడుతూ ”ఏ రాష్ట్రంలో ఎక్కడ హింసాకాండ చెలరేగినా అందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. బీహార్‌లోని షరీఫ్‌లో ఉన్న మదరసా అజిజియాను మంటల్లో తగులబెట్టారు. ముస్లింల దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల వెనుక ముందస్తు ప్రణాళిక ఉంది. నలందా జిల్లా కల్లోలిత ప్రాంతమని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు బాగా తెలుసు. అయినప్పటికీ అక్కడ ఉద్రిక్తతలు తలెత్తాయి. అయినా ఆయనలో పశ్చాత్తాపం లేదు. నిన్న ఇఫ్తార్ విందులో కూడా నితీశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని ముస్లింలను ఎప్పటికీ భయాల్లోనే ఉంచాలని నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ కోరుకుంటున్నారు” అని ఘాటుగా స్పందించారు. ఇక మమతా బెనర్జీ గురించి మాట్లాడుతూ ''బీజేపీ లాగే టీఎంసీ ప్రవర్తిస్తోంది. బీజేపీ కార్యకర్తలు శాంతి భద్రతల్ని భగ్నం చేస్తే, టీఎంసీ కార్యకర్తలు కూడా అదే చేస్తున్నారు. ప్రజల రక్షణ గురించి ఎవరికీ ఆలోచన లేదు'' అని అన్నారు. పశ్చిమబెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, కర్ణాటకలో పశువుల వ్యాపారిని కొట్టి చంపిన ఘటనే కావచ్చు, అక్కడ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయని ఒవైసీ ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)