తమిళనాడుకు చెందిన 78 ఏళ్ల సుబ్బుసామి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. కొన్ని నెలల కిందట ఆయనకు ఢిల్లీ లోని ఎంపీ క్వార్టర్స్లో కొయంబత్తూరుకు చెందిన శివరామన్ అనే వ్యక్తి పరిచయమయ్యారు. తనకు ఎంపీలు, మంత్రులు బాగా తెలుసని, రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మి సుబ్బుసామి తనకు తెలిసిన ముగ్గురు యువకులను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ విషయం మదురైలోని చాలా మందికి తెలిసి మరో 25 మంది ఉద్యోగాల కోసం సుబ్బుసామిని కలిశారు. వీరిని తీసుకుని ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆ నిరుద్యోగులను శివరామన్, వికాస్ రాణా అనే వ్యక్తికి పరిచయం చేశాడు. ఉత్తర రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నానంటూ రాణా వారిని మోసగించాడు. రైల్వేలో టీటీఈ, ట్రాఫిక్ అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.24లక్షల వరకు వసూలు చేశాడు. వైద్య పరీక్షలు, పత్రాల తనిఖీ వంటి తతంగాన్ని నిర్వహించాడు. అనంతరం ఫోర్జరీ పత్రాలతో శిక్షణ ఆర్డర్లు ఇచ్చాడు. ఐడీ కార్డులు కూడా జారీ చేశాడు. ఆ 28 మందికి నెల రోజుల పాటు ఢిల్లీ లోని ఓ రైల్వే స్టేషన్లో 'శిక్షణ' కూడా ఇప్పించాడు. రోజుకు 8 గంటల పాటు స్టేషన్కు వచ్చే, పోయే రైళ్లను, వాటి బోగీలను లెక్కించాలని, ఆ ఉద్యోగాలకు ఇదే శిక్షణ అని నమ్మబలికాడు. ఈ ఏడాది జూన్-జులైలో నెల రోజల పాటు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి అపాయింట్మెంట్ లెటర్లు కూడా జారీ చేశాడు. తీరా వాటిని పట్టుకుని రైల్వే అధికారుల వద్దకు వెళితే అవి ఫోర్జరీ పత్రాలని తేలింది. దీంతో తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న ఆ 28 మంది సుబ్బుసామిని ఆశ్రయించారు. దీంతో ఆయన ఢిల్లీ ఆర్థిక నేరల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగాల పేరుతో ఇలాంటి మోసాల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు నిరుద్యోగులను సూచిస్తున్నారు
రైల్వేలో ఉద్యోగాల పేరిట టోకరా !
December 20, 2022
0
Tags