ప్రమాద బీమా అంటే రోడ్డు, వాహన ప్రమాదాలు జరిగితేనే వర్తిస్తుందనేది అందరి నమ్మకం. కానీ ఏ రకమైన ప్రమాదం జరిగినా బీమా వర్తింపజేసే రెండు పథకాలను పోస్టల్ శాఖ తీసుకొచ్చింది. ప్రతి ఏటా రూ.299 లేదా రూ.399 ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల బీమా మొత్తం చెల్లించే రెండు వేర్వేరు పాలసీలను ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతమున్న బీమా పాలసీలకు భిన్నంగా ఉంటుందని పోస్టల్శాఖ అధికారులు చెప్తున్నారు. కరోనా తర్వాత ఆరోగ్య బీమా చేయించుకునే వారి సంఖ్య పెరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగతంతోపాటు ఫ్యామిలీ ప్యాకేజీ బీమాను కూడా అందజేస్తున్నామని వివరించారు. ఇందుకోసం పోస్టల్ శాఖ టాటా ఏఐజీతో కలిసి పనిచేస్తున్నది. ఈ పాలసీ తీసుకోవాలనుకొనేవారు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాను తెరవాల్సి ఉంటుంది. తపాలాశాఖలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రికరింగ్ డిపాజిట్ వంటి అనేక పాలసీలు ఉన్నాయి. అయితే ఇటీవల వచ్చిన రూ.399, రూ.299 వార్షిక ప్రీమియం చెల్లించే ప్రమాద బీమాకు అనూహ్య స్పందన వస్తున్నది. పాము కాటుతో మరణించినా, అంగవైకల్యం కలిగినా, విద్యుత్తుషాక్తో మరణించినా బీమా వర్తిస్తుంది. తక్కువ ప్రీమియంతోపాటు ఇతర సదుపాయాలు కల్పించడంతో ప్రజలు అధికసంఖ్యలో బీమా చేయించుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. పాలసీదారుడి వయస్సు 18 నుంచి 65 ఏండ్ల మధ్య ఉండాలి. వివరాలకు స్థానిక తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ నార్త్ డివిజన్ జీబీ సత్యేంద్ర కృష్ణ కోరుతున్నారు.
పోస్టల్ శాఖ ప్రమాద బీమా కు అనూహ్య స్పందన
November 16, 2022
0
Tags