హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను శుక్రవారంనాడు ప్రకటించిన ఎన్నికల కమిషన్ గుజరాత్ ఎన్నికల తేదీలను మాత్రం ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ నిశిత విశ్లేషణ చేసింది. ఈ పరిణామం తమకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదని తెలిపింది. గుజరాత్ తేదీలను ఈసీ ప్రకటించకపోవడం వల్ల మరిన్ని భారీ వాగ్దానాలు చేయడానికి, ప్రారంభోత్సవాలకు ప్రధానమంత్రికి ఇంకొంత సమయం దొరకిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అన్నారు. ''ఇది నిశ్చయంగా మోదీకి మరికొంత సమయం ఇవ్వడమే. మాకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదు" అని ఆయన పేర్కొన్నారు. దీనికి ముందు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీని ప్రకటించింది. నవంబర్ 12న ఎన్నికలు జరుపుతామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అర్హమైన డేట్లు, వాతావరణం తదితర పరిస్థితిలను పరిగణనలోకి తీసుకుని గుజరాత్ ఎన్నికల తేదీలను మరోసారి ప్రకటిస్తామని ఈసీ తెలిపింది.
మోదీకి మరికొంత సమయం ఇవ్వడమే !
October 14, 2022
0
Tags