రాజ్యసభ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో రాజస్థాన్లో రిసార్టు రాజకీయాలు మొదలవుతున్నాయి. ఈ నెల 10న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపి మభ్యపెట్టకుండా ఉండేలా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలు అందరినీ రిసార్టులకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. శనివారంలోపు కాంగ్రెస్ రాజస్థాన్ ఎమ్మెల్యేలు అందరూ ఉదయ్పూర్ రిసార్టుకు రావాలని ఆదేశించింది. కొందరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నేడే ఉదయ్పూర్కు తీసుకెళ్తుందని, మరి కొందరిని రేపు తరలిస్తుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, తమకు మద్దతుగా ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ రిసార్టుకు తరలించనుంది. ఉదయ్పూర్ రిసార్టులోనే గత నెల కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ నిర్వహించింది. ఈ నెల 10న రాజస్థాన్లో నాలుగు స్థానాల్లో రెండింటిని కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న రిసార్టు రాజకీయాలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంతలా భయపడుతోందని బీజేపీ రాజస్థాన్ నేత ఒకరు ప్రశ్నించారు.
రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిసార్టుకు తరలింపు
June 02, 2022
0
Tags