కర్ణాటకలోని అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కావడానికి రూ.2,500 కోట్లు ఇవ్వాలని తనను అడిగారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ ఆరోపించారు. కొందరు ఏజెంట్లు ఈ మొత్తం డిమాండ్ చేశారని తెలిపారు. శుక్రవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 'రాజకీయాల్లో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. డబ్బులతో పదవుల ఆశ చూపే దొంగలను నమ్మకూడదు. పార్టీ టికెట్ ఇప్పిస్తాం, సోనియా గాంధీ లేదా జేపీ నడ్డాతో సమావేశం ఏర్పాటు చేస్తాం అంటూ కొందరు ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారు నా వద్దకు కూడా ఒకసారి వచ్చారు. రూ.2500 కోట్లు ఇస్తే సీఎం చేస్తామన్నారు. రూ.2500 కోట్లు అంటే వారు ఏమని అనుకుంటున్నారని నేను ఆలోచనలో పడ్డాను. అంత డబ్బు ఎక్కడ ఉంచుతారు? అన్నది నాకు అర్థం కాలేదు. అందువల్ల ఇలా టికెట్లు, పదవుల ఆశ చూపే కంపెనీలు పెద్ద స్కామ్' అని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ఆయన చేసిన ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇది జాతీయ అంశమని, తప్పక దర్యాప్తు చేయాల్సిందేనని అన్నారు.
రూ.2,500 కోట్లిస్తే సీఎం చేస్తామన్నారు!
May 06, 2022
0
Tags