ఆంధ్రప్రదేశ్ లో మే 9వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే రెండు నెలల సెలవుల అనంతరం జూలై నాలుగో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. ప్రతి ఏటా ఏప్రిల్లో పరీక్షలు ముగించి, మేలో వేసవి సెలవులు, జూన్ మూడో లేదా నాలుగో వారం నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం జరుగుతోంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లపాటు అకడమిక్ ఇయర్ లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. 2020లో నవంబర్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కాగా.. గతేడాది ఆగస్టు రెండో వారం నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఈ నేపథ్యంలో పాఠ్యాంశాల సిలబస్ను కొంతమేర తగ్గించడంతోపాటు విద్యా సంవత్సరాన్నీ ముందుకు జరపాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది మేలో వేసవి సెలవులు ప్రకటించి, జూలైలో కొత్త విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టాలని విద్యాశాఖ ప్రతిపాదనలు చేసింది. పదో తరగతి విద్యార్థులకు మరో పది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ పరీక్షల విభాగం పలు సూచనలు చేసింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండేళ్లుగా పరీక్షలు పూర్తి స్థాయిలో జరగకుండానే పై తరగతులకు వెళ్లడంతో ఈసారి కొంత మేర ఒత్తిడి ఎదుర్కోనున్నారు. పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 27వ తేదీ నుంచి మే తొమ్మిదో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ లో మే 9 నుంచి వేసవి సెలవులు
April 17, 2022
0
Tags