ఢిల్లీలో 5.33శాతానికి పెరిగిన కొవిడ్ పాజిటివిటీ రేటు

Telugu Lo Computer
0


ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతుంది. శనివారం ఢిల్లీలో 461 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పరీక్షల్లో పాజిటివిటీ రేటు 5.33శాతంగా నమోదైంది. ముఖ్యంగా పిల్లల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాఠశాలల్లో కొవిడ్ కేసులు నమోదైతే వెంటనే మూసివేయాలని ప్రభుత్వం స్కూళ్ల యాజమాన్యాలకు సూచనలు చేసింది. ఈ క్రమంలో నోయిడా సెక్టార్ స్కూల్ లో 6,9,12 తరగతులకు చెందిన 13 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ రావడంతో కొన్ని రోజులు పాఠశాల మూసివేశారు. శనివారం మొత్తం 8,646 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 461 మందికి కొవిడ్ సోకినట్లు గుర్తించటం జరిగింది. గడిచిన 48 రోజుల్లో అత్యధిక స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 27న 484 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల పెరుగుదలతో పాజిటివిటి రేటు 5.33శాతంకు పెరిగింది. ఇద్దరు కొవిడ్ తో చికిత్స పొందుతూ మృతి చెందారు. మార్చి 15 తరువాత ఢిల్లీలో ఒకటి కంటే ఎక్కువ మరణాలు నమోదు కావటం ఇదే తొలిసారి. ముఖ్యంగా పిల్లల్లో కొవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళణ వ్యక్తమవుతుంది. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్య నిఫుణులు పేర్కొంటున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ వాటి తీవ్రత తక్కువగానే ఉందని, కొవిడ్ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తే ప్రమాదం ఏమీ ఉండదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ  నేఫథ్యంలో బుధవారం  జరగనున్న ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డిడిఎంఎ) సమావేశంలో ఈ విషయంపై చర్చజరగనుంది. 


Post a Comment

0Comments

Post a Comment (0)