నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను కో-లొకేషన్ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. సోమవారం సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ కో-లోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. చిత్రా రామకృష్ణన్ సీఈవోగా ఉన్నకాలంలో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఆమె ఓ హిమాలయ యోగి ఆదేశాల మేరకు పనిచేశారని, కీలక సమాచారాన్ని లీక్ చేశారని, అనర్హులకు పదవులిచ్చారని పలు ఆరోపణలు ఉన్నాయి. మెయిల్ రూపంలోనే చిత్రకు, అజ్ఞాత బాబాకు మధ్య సంభాషణలు జరిగాయని ఆయన చెప్పిన ప్రాజెక్టులపైనే చిత్రా రామకృష్ణ సంతకాలు చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. దీంతో ఆమెపై 2018 మేలో కేసు నమోదైంది. వరుసగా మూడు రోజుల పాటు చిత్రా రామకృష్ణను విచారించిన సీబీఐ, అదే సమయంలో ఆమె ఇంటిలో సోదాలు జరిపింది. విచారణలో సరిగ్గా సమాధానం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. చిత్రాను విచారించడానికి కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సీనియర్ సైకాలజిస్ట్ సేవలను సైతం వినియోగించింది. ఆమె సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని సైకాలజిస్ట్ నిర్ధారించిన తర్వాత, అరెస్ట్ చేయక తప్పలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. చిత్ర ముందస్తు బెయిల్ కోసం చేసుకొన్న దరఖాస్తును సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసిన తర్వాతే రోజే ఆమెను అదుపులోకి తీసుకున్నారు అధికారులు.
చిత్రా రామకృష్ణ అరెస్టు
March 07, 2022
0
Tags