బీహార్‌లో పోలింగ్ సమయం రెండు గంటలు పెంచిన ఈసీ !

Telugu Lo Computer
0


దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. రెండో విడత శుక్రవారమే జరగనుంది. అయితే వచ్చే వారం పాటు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. మరోవైపు వాడగాల్పుల కారణంగా పోలింగ్ శాతం పడిపోతుందని నిపుణులు కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఐఎండీ చీఫ్‌తో ఎన్నికల సంఘం చర్చలు జరిపింది. వాడగాల్పులు ఎక్కువగా వీచే రాష్ట్రాల్లో బీహార్ కూడా ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయాన్ని ఈసీ పొడిగించింది. రెండు గంటల పాటు అదనంగా సమయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. బీహార్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎన్నికల సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం.. బంకా, మాధేపురా, ఖగారియా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. అయితే వేడిగాలుల దృష్ట్యా పోలింగ్‌ శాతాన్ని పెంచేలా ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని పొడిగించాలని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్‌ సమయాన్ని మార్చాలని నిర్ణయించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించింది. అంటే సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)