వసతి గృహం నుంచి 26 మంది బాలికల మిస్సింగ్

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్వహిస్తున్న ఓ బాలికల వసతి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్‌లోని పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భోపాల్‌ శివారులోని పర్వాలియా ఆంచల్ బాలికల హాస్టల్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో ఆకస్మికంగా సందర్శించారు. ఈ సమయంలో రిజిస్టర్‌ను పరిశీలించగా అందులో 68 మంది బాలికల ఎంట్రీలు ఉండగా.. అందులో 26 మంది అదృశ్యమైనట్లు తేలింది. అదృశ్యమైన కొందరు బాలికలు గుజరాత్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన వారు కాగా, మరికొందరు మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌, రైసెన్‌, చింద్వారా, బాలాఘాట్‌కు చెందిన వారిగా గుర్తించారు.అదృశ్యమైన బాలికల గురించి చిల్డ్రన్స్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను అధికారులు ప్రశ్నించగా అతను సరైన సమాధానం చెప్పలేదు. దీంతో వారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికల హాస్టల్‌ నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో హాస్టల్‌లో అనేక అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. ఆ వసతి గృహం కూడా అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. మరోవైపు ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగో సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మిషనరీ నిర్వహిస్తున్న అక్రమ బాలల గృహాన్ని రాష్ట్ర బాలల కమిషన్ చైర్మన్‌తో కలిసి సంయుక్తంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. ఎలాంటి అనుమతులూ లేకుండానే బాలికల హాస్టల్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారు ప్రధానంగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని ఈ బాలికల గృహంలో 6 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల 40 మందికి పైగా బాలికలు ఉన్నట్లు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)