మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. మోహన్ యాదవ్ 2013లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉజ్జయిని సౌత్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. భోపాల్లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. బీజేపీ హైకమాండ్ దూతలు సీఎం శివరాజ్సింగ్ చౌహాన్తో చర్చలు జరిపారు. అనంతరం మోహన్ యాదవ్ పేరును ప్రకటించారు. శివరాజ్తో పాటు కేంద్రమంత్రులు ప్రహ్లాద్ పటేల్ , నరేంద్ర తోమర్ కూడా సీఎం రేసులో ఉన్నప్పటికీ ఎవరూ ఊహించని పేరును అధిష్టానం తెరపైకి తీసుకువచ్చింది. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో మరో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. అయితే, శివరాజ్ సింగ్ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచిందని, ఆయనకే సీఎం పదవి ఇవ్వాలని బీజేపీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మరోవైపు కేంద్రమంత్రి జ్యోతిరాధిత్యా సింధియాను సీఎం చేయాలని ఆయన మద్దతుదారులు కూడా ఆందోళన చేశారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ మద్దతుదారులు కూడా ఆయన పోస్టర్తో సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడు కన్పించలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్లో సీఎం పదవి కోసం ఆరుగురు పోటీ పడ్డారు. 16 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించిన శివరాజ్సింగ్ చౌహాన్ కూడా పదవి కోసం తీవ్రంగా పోటీ పడగా,అధిష్టానం మాత్రం మోహన్ యాదవ్ వైపు మొగ్గుచూపింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ !
December 11, 2023
0
Tags