నవంబర్ 1న టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో !

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఉమ్మడిగా ఎదుర్కొంటూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇవాళ టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ రాజమండ్రిలో భేటీ అయింది. ఈ భేటీకి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ఈ భేటీలో మొత్తం ఆరు అంశాలపై చర్చ జరిగింది. ఇందులో ఉమ్మడి మ్యానిఫెస్టో ఇవ్వాలా లేక కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకటించాలా అన్నదానిపైనా చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మీడియాతో ఈ వివరాలు వెల్లడించారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన టీడీపీ-జనసేన కమిటీ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో ఇరు పార్టీలపై వైసీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. 2014లో తాను టీడీపీకి మద్దతిచ్చానని, రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలన్న లక్ష్యంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ గుర్తుచేశారు. వైసీపీకి, జగన్ కు తాను వ్యతిరేకం కాదని, వారి విధానాలకు మాత్రమే వ్యతిరేకమన్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం వైసీపీ అనే తెగులు పట్టుకుందన్నారు. సీఎం జగన్ మద్యపాన నిషేధంపై కానీ, ఉద్యోగుల సీపీఎస్ పై కానీ మాట నిలబెట్టుకోలేదని పవన్ ఆరోపించారు. ఎన్డీయే భాగస్వామ్యంలో ఉండి కూడా ఇప్పుడు ఏపీ ప్రజల కోసం చారిత్రక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇకపై టీడీపీ-జనసేన ఉమ్మడిగా ఉద్యమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్ధితుల్లోనూ చీలనివ్వమని తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని, దీనికి వ్యతిరేకంగా క్షేత్రస్ధాయిలో ఉద్యమాలు చేపడతామన్నారు. రాబోయే వంద రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇవాళ చర్చించినట్లు నారా లోకేష్ తెలిపారు. 29, 30, 31 రోజుల్లో ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటామన్నారు. నవంబర్ 1 నుంచి మ్యానిఫెస్టో రూపొందించుకుని ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుడతామన్నారు. కరువు నేపథ్యంలో రైతులు నష్టపోతున్నందున ఇరు పార్టీల నేతలు క్షేత్రస్ధాయిలో పర్యటించి జేఏసీకి నివేదిక ఇస్తారన్నారు. ఈ మీటింగ్ లో మూడు తీర్మానాలు చేశామని, చంద్రబాబు అక్రమ అరెస్టును నిరస్తూ ఓ తీర్మానం, అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడేందుకు పొత్తు పెట్టుకోవాలని, అన్ని వర్గాల్ని అభివృద్ధి చేసేలా మరో తీర్మానం చేశామన్నారు. పవన్ చెప్పినట్లు ఇదో చారిత్రక కలయిక అని లోకేష్ తెలిపారు. 2024లో ఎన్నడూ లేనంత మెజారిటీతో రాష్ట్రంలో ఇరు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. మళ్లీ ఏపీకి మంచి రోజులు తెస్తామని హామీ ఇస్తున్నట్లు లోకేష్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)