ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అమెరికాకు భారత మామిడి ఎగుమతులు 19 శాతం వృద్ధి సాధించడంలో వాణిజ్యం, పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహోరోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (అపెడా) విశేష కృషి సాధించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో అపెడా చొరవతో మామిడి ఎగుమతుల్లో గణనీయ వృద్ధి నమోదైందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ 48 మిలియన్ డాలర్ల విలువైన మామడిని భారత్ ఎగమతి చేసిందని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 19 శాతం అధికమని తెలిపింది. ఇతర దేశాలకు మామిడి ఎగుమతులు విస్తరించడంతో ఈ అరుదైన ఫీట్ సాధ్యమైందని పేర్కొంది. అమెరికన్ వ్యవసాయ, జంతు, మొక్కల ఆరోగ్య తనిఖీ సేవల (ఏపీహెచ్ఐఎస్)తో భారత్ సమన్వయంతోనే ఈ మైలురాయి చేరుకోగలిగామని తెలిపింది. వాషి, నాసిక్, బెంగళూర్, అహ్మదాబాద్ ఫెసిలిటీల నుంచి మామిడికి ఏపీహెచ్ఐఎస్ ఇన్స్పెక్టర్లు ప్రీ క్లియరెన్స్ ఇవ్వడంతో అమెరికాకు మామిడి ఎగుమతులకు వెసులుబాటు లభించిందని వెల్లడించింది. అమెరికాతో పాటు జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో మామిడి పండ్లు ఎగుమతి అవుతుండగా తాజాగా దక్షిణాఫ్రికాకూ మామిడి ఎగుమతులు చేపట్టేందుకు భారత్ కసరత్తు సాగిస్తోంది.
అమెరికాకు మామిడి ఎగుమతుల్లో 19 శాతం వృద్ధి !
October 27, 2023
0
Tags