క్రెడిట్ హిస్టరీ లేకపోయినా అప్పులు తీసుకోవడానికి వీలు కల్పించే ఇన్నోవేటివ్ సిస్టమ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురానుంది. రైతులైనా, చిన్న వ్యాపారులైనా తొందరగా అప్పులు పొందేలా ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను డెవలప్ చేస్తున్నట్లు క్రెడిట్ పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. సాఫీగా అప్పులు పొందేలా ఈ ప్లాట్ఫామ్ ఉంటుందని, దీనిని రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ డెవలప్ చేస్తోందని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)పై అప్పులు ఇచ్చేందుకు ఒక పైలట్ ప్రాజెక్టును ఆర్బీఐ, ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్లు చేపట్టాయి. మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, యూపీ, మహారాష్ట్రలలోని కొన్ని జిల్లాలలో ఈ పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే నడుస్తోంది. ఈ పైలట్ ఆధారంగా ఇప్పుడు కొత్త పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ డెవలప్ చేయనున్నారు. రైతులు, డెయిరీ ఫార్మ్లు నడిపే వారిలో చాలా మందికి క్రెడిట్ హిస్టరీ లేకపోవడంతో అప్పులు పుట్టడం కష్టమవుతోంది. లెండింగ్లో ఇదొక ఓఎన్డీసీ లాంటి ఇన్నోవేషన్గా ఆర్బీఐ చెబుతోంది. మరోవైపు యూపీఐ లైట్తో చేసే ట్రాన్సాక్షన్ల లిమిట్ను ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి 500 కి ఆర్బీఐ పెంచింది. సిస్టమ్లో లిక్విడిటీ తగ్గించే లక్ష్యంతో క్యాష్రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను ఇంక్రిమెంటల్గా 10 శాతం ఆర్బీఐ పెంచింది. దీంతో సిస్టమ్నుంచి దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఆర్బీఐ వద్దకు చేరుతాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇదే సరైన ఆప్షన్గా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. అప్పులు ఇవ్వడానికి తగినంత డబ్బు బ్యాంకుల వద్ద ఉందని, ఆ లిక్విడిటీ సరిపోతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు రెపో రేటును 6.50 శాతం వద్దే కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ మెంబర్లందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. సీఆర్ఆర్ పెంపు ఈ ఏడాది సెప్టెంబర్ 8 దాకా అమలులో ఉంటుందని దాస్ వెల్లడించారు. జూన్ 2022 నుంచి చూస్తే ఈ ఏడాది ఆగస్టు 14 నాడు సిస్టమ్లో అత్యధికంగా రూ. 2.48 లక్షల కోట్ల అదనపు లిక్విడిటీ ఉన్నట్లు డేటా చెబుతోంది. తాజా డేటా ఆధారంగా సెప్టెంబర్ 8 న సీఆర్ఆర్ పెంపును రివ్యూ చేయనున్నట్లు ఎంపీసీ డిపార్ట్మెంట్ హెడ్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర చెప్పారు. కూరగాయల రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ధరల కట్టడి కోసం తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని, అవసరమైతే వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుందని దాస్ పేర్కొన్నారు. జియో పొలిటికల్ టెన్షన్లు కొనసాగుతున్నాయని, మరోవైపు వాతావరణ పరిస్థితుల వల్లా ఇబ్బందులెదురవుతున్నాయని దాస్ అన్నారు. ఇన్ఫ్లేషన్ సమస్యలు ఇంకా ముగిసిపోలేదని చెప్పారు. మార్కెట్ నుంచి రూ. 2 వేల నోటును విత్డ్రా చేయడంతో లిక్విడిటీ భారీగా పెరగడానికి ఒక కారణమైందని చెబుతూ, 90 శాతం రూ. 2 వేల నోట్లు (రూ. 3.60 లక్షల కోట్లు) వెనక్కి వచ్చేశాయని దాస్ వెల్లడించారు.
అప్పులు తీసుకోవడానికి వీలు కల్పించే ఇన్నోవేటివ్ సిస్టమ్ !
August 11, 2023
0
Tags