రుతుపవనాల రాకతో దేశంలో పలు నగరాల్లో వర్షాలు మొదలయ్యాయి. అయితే.. రావడం కాస్త లేటయినా రుతుపవనాలు ఈ ఏడాది ఓ విశేషాన్ని తీసుకొచ్చాయి. ఈ సారి ఢిల్లీ, ముంబయిల్లోనూ ఒకేసారి కుండపోత వర్షాలు కురిశాయి. దేశ రాజధానిని, పశ్చిమ తీరంలో ఉన్న ముంబయిని ఒకే సారి రుతుపవనాలు తాకడం గత అరవై ఏళ్లలో ఇదే ప్రథమం. ఈ ఏడాది రుతుపవనాలు అంచనా వేసిన గడువుకు రెండు వారాల తర్వాత ముంబయిని తాకాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) తెలిపింది. కానీ దేశ రాజధాని ఢిల్లీని మాత్రం రెండ్రోజుల ముందే చేరాయని వెల్లడించింది. 1961 జూన్ 21న మొదటిసారి ముంబయి, ఢిల్లీని రుతుపవనాలు ఒకేసారి తాకాయి.. ఇన్నాళ్లకు మళ్లీ పునరావృతం అయినట్లు ఐఎమ్డీ తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు మహారాష్ట్ర మొత్తం వ్యాపించాయి. అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యాణాలో కొంత భాగం, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్ముని చేరాయని ఐఎమ్డీ వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో దేశమంతటా వ్యాపిస్తాయని పేర్కొంది. ముంబయి, ఢిల్లీలో శనివారం రాత్రి కుండపోత వర్షం సంభవించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
ఢిల్లీ, ముంబయిని ఒకేసారి తాకడం గత 60ఏళ్లలో ఇదే ప్రథమం !
June 25, 2023
0
Tags