తమిళనాడులో ప్లస్-2 పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమశ్రేణిలో నిలవడంతో పాటు 600కి 600 మార్కులు సాధించిన దిండుగల్ విద్యార్థిని నందిని ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. దిండుగల్ అన్నామలైయార్ మిల్స్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని నందిని ఆరు పాఠ్యాంశాలలో నూటికి నూరు మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ శ్రేణిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ విద్యార్థినిని, ఆమె కుటుంబీకులకు అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా చెన్నైలో తనను కలుసుకోవాల్సిందిగా సమాచారం పంపారు. ఆ మేరకు చెన్నై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం నందిని, ఆమె కుటుంబీకులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నందినికి చాక్లెట్ల బాక్స్ను స్టాలిన్ కానుకగా అందజేశారు. నందినితోపాటు ఆమె తల్లిదండ్రులు, దిండుగల్ పాఠశాల హెడ్మాస్టర్ ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష, ఆ శాఖ డిప్యూటి కమిషనర్ కె.నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ... నందిని ఉన్నత విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, ఆమెకు నచ్చిన కోర్సులో నచ్చిన కళాశాలలో చేరవచ్చనని తెలిపారు.
నందిని ఉన్నత విద్యకయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుంది !
May 10, 2023
0
Tags