జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో జరుగనున్న జీ20 సదస్సుకు తాము హాజరుకావడం లేదని ప్రకటించింది. వివాదాస్పద భూభాగంలో సమావేశాలు జరపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పింది. కాశ్మీర్లో నిర్వహించే ఇలాంటి భేటీలకు తాము వచ్చేది లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. శ్రీనగర్లో జీ20 సమావేశాలు నిర్వహించడంపై చైనా అభ్యంతరం వ్యక్తంచేయడం ఇదే మొదటిసారి. అయితే కాశ్మీర్పై ఎప్పుడూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే టర్కీ, సౌదీ అరేబియా లాంటి దేశాలు జీ20 సమావేశాల నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు శ్రీనగర్లోని షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్లో పర్యాటక రంగంపై జీ20 వర్కింగ్ గ్రూప్ మూడో సదస్సు జరుగనున్నది. ఈనేపథ్యంలో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. శ్రీనగర్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాల్ సరస్సు పరిసర ప్రాంతాలను ఎన్ఎస్జీ కమాండోలు జల్లడపట్టారు. సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు తిరుగనున్న మార్గాలను సుందరంగా అలంకరించారు. ఈ సమావేశంలో 60 మందికిపైగా విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారని అధికారులు వెల్లడించారు.
శ్రీనగర్ జీ20 సదస్సుకు రావడంలేదన్న చైనా
May 20, 2023
0
Tags