పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా మూడో రోజు ఎటువంటి చర్చ లేకుండానే ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. బుధవారం కూడా ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయ సభల్లోని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అదానీ అంశంపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి సభ్యులు పట్టుబట్టారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో నేడు కూడా ఉభయసభలు ముందుగా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. అనంతరం పార్లమెంటు నుండి ప్రతిపక్షాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కార్యాలయానికి ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించాయి. భారీ భద్రతాదళాలను మోహరించిన కేంద్రం వారిని ఈడి కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నాయి. దీంతో ప్రతిపక్ష ఎంపిలు తిరిగి పార్లమెంటుకు చేరుకున్నారు. మధ్యాహ్నం సభలు ప్రారంభమైనప్పటికీ గందరగోళంగా మారడంతో లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ ఉభయ సభలను గురువారానికి వాయిదా వేశారు.
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
March 15, 2023
0
Tags