బీహార్లోని గయా ప్రాంతంలో తన్కుప్ప రైల్వే స్టేషన్ నుంచి ఒక గూడ్సు రైలు బయలుదేరింది. సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. తనవైపుకి రైలు దూసుకెళ్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టాలు దాటాలని అడుగు ముందుకేసింది. ఈ కంగారులో ఆమె కాలుజారి పట్టాలపై పడింది. ఇంతలో ట్రెయిన్ దూసుకురావడంతో, పట్టాల మధ్య పడుకుంది. రైలు వెళ్లిపోయేంతవరకు కదలకుండా, అలాగే ఉండిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలు అయ్యాయి. పట్టాల కింద ఆమెను గమనించిన పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని, రైలు వెళ్లాక ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంత అవసరం ఏమొచ్చిందని పట్టాలు దాటేందుకు ప్రయత్నించావు? అని అడిగితే అవతల ప్లాట్ఫామ్లో ఉన్న ట్రైన్ని అందుకోవడం కోసమే తాను అలా చేశానని ఆమె సమాధానం ఇచ్చింది. ఆ రైలు ఎక్కడ వెళ్లిపోతుందన్న ఆందోళనలో, పట్టాలు దాటేందుకు ప్రయత్నించానని, కానీ ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఒకరు సెల్ఫోన్లో రికార్డ్ చేసి నెట్టింట్లో పెట్టగా, ఆ వీడియో వైరల్ అయ్యింది.
అదృష్టమంటే ఇదేనేమో !
February 11, 2023
0