కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం బుధవారం రాత్రి అత్యవసరంగా గువాహటిలో ల్యాండ్ అయింది. త్రిపుర రాజధాని అగర్తలలోని మహారాజా బిర్ బిక్రమ్ విమానాశ్రయం ఇది ల్యాండ్ కావాల్సింది. అయితే, దట్టమైన పొగమంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చింది. అనంతరం గువాహటిలోని లోక్ప్రియ గోపినాథ్ బోర్డోలాయ్ విమానాశ్రయంలో దిగింది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం కేంద్రమంత్రి బుధవారం రాత్రి అగర్తల వెళ్లాల్సి ఉంది. 'రాత్రి పది గంటల సమయంలో ఆయన మహారాజా విమానాశ్రయానికి చేరుకోవాలనుకున్నారు. అధికారులు ఇచ్చిన ముందస్తు సమాచారం మేరకు దట్టమైన పొగమంచు కారణంగా అది సాధ్యపడలేదు' అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ప్రచారంలో భాగంగా గురువారం రెండు రథయాత్రలను ఆయన ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అమిత్ షా విమానం గువాహటిలో అత్యవసర ల్యాండింగ్ !
January 05, 2023
0