పంజాబ్ లో మరో 400 మొహల్లా క్లీనిక్‌లు ప్రారంభం !

Telugu Lo Computer
0


పంజాబ్ ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు ఇప్పటికే వంద మొహల్లా క్లీనిక్‌లు ప్రారంభించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తాజాగా మరో 400 క్లీనిక్‌లను ఆ పార్టీ అధ్యక్షుడు అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ కేవలం 10 నెలల్లోనే 500 మొహల్లా క్లీనిక్‌లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సౌకర్యలు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంజాబ్‌ ఆరోగ్యమంత్రి బల్బీర్‌ సింగ్‌, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్‌ మాట్లాడుతూ ఢిల్లీ లోని మొహల్లా క్లీనిక్‌లను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సీఎం అక్కడ బస్తీ దావాఖానాలు పెట్టారన్నారు. తమిళనాడు సీఎం దిల్లీ తరహాలో అక్కడ పాఠశాలలు నిర్మిస్తున్నారన్నారు. తాము విద్య, వైద్యం, పరిశ్రమల గురించే మాట్లాడుతున్నామని, ద్వేషం గురించి కాదన్నారు. ఈ క్లీనిక్‌లకు వచ్చే రోగుల సమస్యలకు సంబంధించిన రికార్డులను వారి మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం చేసి రాష్ట్రంలోని ఏ క్లీనిక్‌లోనైనా వచ్చే విధంగా చేస్తున్నట్టు చెప్పారు. రోగుల రికార్డులను కంప్యూటరీకరిస్తామన్నారు. ఎన్నికల సమయంలో పంజాబీలకు ఇచ్చిన హామీలను నెరవేస్తున్నట్టు చెప్పారు. పంజాబ్‌ను బ్రిటీష్‌ వారి కన్నా రాజకీయ నేతలే దోపిడీ చేశారని మండిపడ్డారు. ఆ దోపిడీని తాము అడ్డుకుంటున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీ తరహాలోనే పంజాబ్‌ లోనూ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఆప్‌ సర్కార్‌ చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లను విదేశాల్లో శిక్షణకు పంపించాలని పంజాబ్‌ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఫిబ్రవరి 4న సింగపూర్‌కు తొలి విడతలో 36 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లను పంపించబోతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)