ఎయిర్‌ఫోర్స్ 90వ వార్షికోత్సవ వేడుకలు !

Telugu Lo Computer
0


ప్రతి ఏటా అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే నిర్వహిస్తారు. ఈ ఏడాదితో భారత వైమానిక దళం ఏర్పడి 90 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 90 ఏళ్లలో భారత వాయుసేన దాటిన మైలు రాళ్లు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఎయిర్‌ఫోర్స్‌గా అవతరించడం వెనుక కూడా చాలా చరిత్రే దాగుంది. 1932లో బ్రిటీష్ ప్రభుత్వానికి సాయంగా భారత వాయుసేన ఏర్పాటైంది. అప్పుడు.. బ్రిటీష్ వారు  భారతీయులు ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడపలేరని తక్కువగా అంచనా వేశారు. అయితే.. మొదటి ప్రపంచ యుద్ధంలో 19 ఏళ్ల ఇంద్ర లాల్ రాయ్ రాయల్ ఫ్లయింగ్ కార్ప్స్‌లో చేరి సత్తా చాటాడు.  అతన్ని తొలి భారతీయ ఫైటర్ పైలట్‌గా చెబుతారు. భారతదేశంలో  ప్రత్యేక వైమానికదళం అవసరమని భావించిన బ్రిటీష్ ప్రభుత్వం.. ఆరుగురు ఇండియన్ క్యాడెట్లను.. 1930లో పైలట్‌లుగా శిక్షణ పొందేందుకు ఇంగ్లండ్ పంపించారు. అలా.. 1932 అక్టోబర్ 8న.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటైంది. ఇందులో కొందరు పైలట్లతో పాటు 29 మంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. నాలుగు వెస్ట్ ల్యాండ్ వాపిటి బైప్లేన్‌లు ఉన్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడిపే విషయంలో.. బ్రిటీష్ అధికారులు భారతీయులను నమ్మలేకపోయారు. దీంతో.. 1934లోనే.. భారత్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్, ఎయిర్ మార్షల్ సర్ జాన్ స్టీల్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ని రద్దు చేయాలని భావించారు. కానీ.. అదృష్టవశాత్తూ అది జరగలేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి.. గత 90 ఏళ్లలో ఇండియన్ ఆర్మీ ఆకాశమే హద్దుగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. అమెరికా, రష్యా, చైనా తర్వాత.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఎయిర్‌ఫోర్స్‌గా అవతరించింది. విదేశాల నుంచి ఫైటర్ జెట్స్ కొనుగోలు చేస్తూనే.. మనదేశంలోనూ సొంతంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు తయారుచేసుకునే స్థాయికి ఎదిగింది భారత్. ఇప్పటికే.. దేశీయంగా మిస్సైల్స్ తయారుచేసుకుంటున్న భారత్.. తాజాగా అస్త్ర ఎంకె-2 అనే బియాండ్ విజువల్ రేంజ్.. ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్‌ని.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలోకి చేర్చింది. అంతేకాదు.. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో.. లైట్ కాంబాట్ హెలికాప్టర్‌ని కూడా ఐఏఎఫ్‌లోకి ప్రవేశపెట్టారు. 90వ ఎయిర్‌ఫోర్స్ డేను పురస్కరించుకొని.. ఈ రెండు అస్త్రాలను.. వాయుసేనలో ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. ప్రస్తుతం.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 36 రాఫెల్ ఫైటర్ జెట్స్, 272 సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, 32 తేజస్, 65 మిగ్-29 ఎయిర్‌క్రాఫ్ట్స్, 51 మిరాజ్ 2000 జెట్స్, 130 సెపెకాట్ జాగ్వార్ జెట్స్, 54 మిగ్-21 కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇక.. హెలికాప్టర్లు, ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, క్యారియర్స్ అన్నీ కలిపితే.. 1645 దాకా ఉన్నాయ్. ఇందులో.. వేటికవే స్పెషల్. ఒక్కసారి గాల్లోకి లేస్తే.. శత్రుదేశం ఫైటర్ జెట్స్.. నేల కూలాల్సిందే. ఇక.. రాఫెల్ ఫైటర్ జెట్స్ వచ్చాక.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కెపాసిటీ డబుల్ అయింది. దాని పేరు వింటేనే.. శత్రుదేశం గుండెలదిరిపోతాయి.  ఇండియన్ ఆర్మీ ఎన్నో కీలక మైలురాళ్లను దాటి వచ్చింది. 2016లో మొట్టమొదటిసారిగా ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్‌లను నియమించి.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చరిత్ర సృష్టించింది. భారత వాయుసేనలో.. పద్మావతి బందోపాధ్యాయ తొలి మహిళా ఎయిర్ మార్షల్. భారత సాయుధ దళాల్లో.. త్రీ స్టార్ ర్యాంక్‌కు పదోన్నతి పొందిన రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఐఏఎఫ్ మైల్‌స్టోన్స్‌లో చెప్పుకోవాల్సింది ఆపరేషన్ రాహత్. కేవలం హెలికాప్టర్లను ఉపయోగించి.. చేసిన అతిపెద్ద సివిలియన్ రెస్క్యూ ఆపరేషన్ ఇది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఎయిర్‌ఫోర్స్ కూడా ఇది చేయలేదు. 2013లో ఉత్తరాఖండ్‌, హిమాచల్ ప్రదేశ్‌లో భీకరమైన వరదలు సంభవించినప్పుడు.. 19 వేల 6 వందల మందిని హెలికాప్టర్ల ద్వారా వాయుసేన సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక.. 2014లో ఇండోనేషియాలోని సమత్రా పశ్చిమ తీరాన్ని సునామీ తాకిన గంటలోపే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ భారత తూర్పు తీరానికి చేరుకొని చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సియాచిన్ గ్లేసియర్ దగ్గర ఉంది. ఇది.. సముద్ర మట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. 2013లో లద్దాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డ్ ఎయిర్‌స్ట్రిప్‌లో.. సూపర్ హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను 16 వేల 614 అడుగుల ఎత్తులో ల్యాండ్ చేసి.. ఐఏఎఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇక.. 2018లో తీవ్రమైన వరదలతో దెబ్బతిన్న కేరళలో సహాయ చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడమే కాదు.. అక్కడి సీఎం రిలీఫ్ ఫండ్‌కు 20 కోట్లు విరాళంగా ఇచ్చింది. భారత వాయుసేనలో మిగతా అన్ని ప్రత్యేక దళాలతో పోలిస్తే.. గరుడ్ కమాండో ఫోర్స్ ట్రైనింగ్ సుదీర్ఘంగా ఉంటుంది. ఐఏఎఫ్‌లోని మొత్తం పైలట్లలో.. 13 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇది.. ప్రపంచంలోనే అత్యధికం మాత్రమే కాదు వరల్డ్ యావరేజ్ కంటే దాదాపు రెట్టింపు. లేహ్‌లోని ఖర్దుంగ్ లా పాస్‌లో.. అత్యధిక స్కైడైవ్ ల్యాండింగ్‌తో.. ఐఏఎఫ్ రికార్డ్ సృష్టించింది. 2020 అక్టోబర్‌లో.. వింగ్ కమాండర్ గజానంద్ యాదవ, వారెంట్ ఆఫీసర్ ఏకే తివారి.. దాదాపు 18 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేశారు. వాయుసేనకు చెందిన C-130J హెర్క్యులస్ విమానం.. ఆన్‌బోర్డులో ఎక్కువ దూరం ప్రయాణించిన విమానంగా రికార్డ్ సృష్టించింది. ఇక.. న్యూఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ అయిన వాయు భవన్.. 2019లో.. దేశంలోనే.. బెస్ట్ మెయింటెయిన్డ్ బిల్డింగ్‌గా ఎంపికైంది. కోవిడ్ టైంలో దేశం మొత్తం ఆక్సిజన్ కొరతతో పోరాడుతున్నప్పుడు.. లక్షలాది మంది ప్రాణాలను రక్షించడంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అద్భుతంగా పనిచేసింది. మిషన్ ఆక్సిజన్ పేరుతో.. ఐఏఎఫ్.. క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఆక్సిజన్ ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకు, ఇతర కోవిడ్ సహాయ సామాగ్రిని సప్లై చేసింది. ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఇలా ఎన్నో ఆపరేషన్లలో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకంగా పనిచేసింది. దేశ సేవలో తన వంతు పాత్ర పోషించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)