జోగిని అనుమానాస్పద మృతి

Telugu Lo Computer
0


ఈ నెల 20న కొండాపూర్‌ మండలం మారేపల్లిలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో అంబర్‌పేటకు చెందిన జోగిని దీపిక బోనం (టిల్లు) ముగ్గురు మిత్రులతో కలిసి పాల్గొంది. రాత్రి సుమారు ఒంటి గంట తర్వాత తిరుగు పయనమైంది. తెల్లవారుజామున లింగంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దీపిక మృతి చెందినట్లు కొండాపూర్‌ ఎస్సై వెంకటేశం తెలిపారు. ఆమె సోదరుడు సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కొండాపూర్‌లో బోనాల ఉత్సవాలు ముగిసిన తరువాత తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో లింగంపల్లి కూడలి మెడికవర్‌ ఆసుపత్రికి దీపికను తీసుకొచ్చారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం రామచంద్రాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ ఠాణాలో కేసు నమోదయింది. అనంతరం కొండాపూర్‌, రామచంద్రాపురం పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న దీపిక ఎలా గాయపడింది.. ఆ తర్వాత ఎవరు ఆసుపత్రికి తీసుకొచ్చారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. కొండాపూర్‌ నుంచి రామచంద్రాపురం వరకు సీసీ ఫుటేజీ వివరాలు సేకరించారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన వారు.. కారును వదిలి వెళ్లగా, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మారేపల్లిలో బోనాల వేడుకలు ముగిశాక.. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో దీపికతో పాటు మరో ముగ్గురు ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కొండాపూర్‌ కూడలిలోని వైన్‌షాపు వద్ద ఉన్న సీసీ ఫుటేజీలో నలుగురు కలిసే ఉన్నట్టు గమనించారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆసుపత్రిలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరనే విషయంపైనా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. కొండాపూర్‌ పోలీసులు మాత్రం.. కేసును విచారిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)