రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే ఉంటుందని ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). సోమవారం రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు 'ఆప్' తమ మద్దతు ఎవరికి అనే విషయం ప్రకటించలేదు. ఈ అంశంపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై అధికారికంగా ప్రకటించారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయనున్న పార్టీల్లో 'ఆప్' కూడా చేరింది. ఈ అంశంపై పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటే తమకు గౌరవం ఉందని, అయితే ఓటు మాత్రం యశ్వంత్ సిన్హాకే వేస్తామని ఆయన చెప్పారు. ఎన్డీయే అభ్యర్థికి అనుకూలంగా బిజూ జనతా దళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, శిరోమణి అకాళీదల్, ఏఐఏడీఎమ్కేతోపాటు టీడీపీ వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి.
ఆప్ ఓటు యశ్వంత్ సిన్హాకే !
July 16, 2022
0