అసోంను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వరదల కారణంగా రాష్ట్రంలో 21 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరద ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అసోం విపత్తు నిర్వహణ దళం (ఏఎస్డీఎమ్ఏ) ప్రకటించింది. 30 జిల్లాల్లోని 43 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారని ఏఎస్డీఎమ్ఏ వెల్లడించింది. వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇటీవలి వరదల కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 70కి చేరింది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. అసోంలో వరద పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మతో వరద ప్రభావంపై చర్చిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న అసోం, మేఘాలయ రాష్ట్రాలకు కేంద్రం అవసరమైన సాయం అందిస్తుందని అమిత్ షా ప్రకటించారు. త్వరలోనే కేంద్ర బృందం రాష్ట్రాలలో పర్యటిస్తుందని, అక్కడి వరద ప్రభావంపై అంచనా వేసి నివేదిక అందజేస్తుందని అమిత్ షా తెలిపారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఆర్మీ, ఏఎస్డీఎమ్ఏ దళాలు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నాయి. అసోంలో దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరద ప్రభావం పెరుగుతోంది. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
అసోం వరదల్లో 11 మంది మృతి
June 20, 2022
0
Tags