కల్తీ మద్యంపై హోంమంత్రికి మందుబాబు ఫిర్యాదు

Telugu Lo Computer
0


మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినిలోని బహుదూర్ గంజ్ ప్రాంతానికి చెందిన లోకేష్ సోథియా (42) పెయిడ్ పార్కింగ్ స్టాండ్ నిర్వహిస్తూ ఉంటాడు. ఏప్రిల్ 12న స్ధానికంగా ఉన్నమద్యం దుకాణంలో నాలుగు సీల్డ్ క్వార్టర్ల స్వదేశీ మద్యం సీసాలు కొనుగోలు చేశాడు. స్నేహితుడితో కలిసి రెండు మద్యం సీసాలు సేవించాడు. అయితే అతనికి ఆ మద్యం కిక్ ఇవ్వలేదు. తనకు మద్యం కిక్ ఇవ్వకపోవటంతో అది కల్తీ మద్యంగా భావించాడు. మద్యంలో నీళ్లు కలిపారని ఆరోపించాడు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాతో పాటు ఉజ్జయిని ఎక్సైజ్ కమీషనర్ ఇందర్ సింగ్ దామోర్ కు ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. ఆహారం, ఆయిల్ కల్తీలాగా మద్యం కూడా కల్తీ చేయటంపై ఆందోళన వ్యక్తం చేశాడు. నీళ్లు కలిపిన కల్తీ మద్యం అమ్మిన షాపుపై వినియోగ దారుల కోర్టును కూడా ఆశ్రయించాడు. తాను గడిచిన 20 ఏళ్లుగా రోజూ మద్యం సేవిస్తానని లోకేష్ సోథియా తెలిపాడు. దీంతో మద్యం రుచి, క్వాలిటీ తాను వెంటనే చెప్పగలనని అన్నాడు. తాను కొనుగోలు చేసిన మిగతా రెండు క్వార్టర్ మద్యం బాటిల్స్‌ను దీనికి సాక్ష్యంగా ఉంచానని చెప్పాడు. నకిలీ మద్యం అంశంపై విచారణ జరపమని ఒక అధికారిని నియమించినట్లు ఎక్సైజ్ కమీషనర్  ఇందర్ సింగ్ చెప్పారు. విచారణ అనంతరం సంబంధిత లిక్కర్‌ షాపుపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా, కల్తీ మద్యం అమ్మిన వైన్ షాపుపై వినియోగదారుల కోర్టులో చీటింగ్‌ కేసు పెట్టినట్లు లోకేష్‌ తరుఫు న్యాయవాది నరేంద్ర సింగ్ ధాక్డే వెల్లడించారు. తన క్లయింట్ 20 ఏళ్లుగా మద్యం సేవిస్తున్నాడని ఏదీ ఒరిజినల్, ఏది నకిలీదో ఇట్టే గుర్తు పట్టగలడని న్యాయవాది అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)