ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ రాసిన టూంబ్ ఆఫ్ శాండ్ నవలకు బుకర్ ప్రైజ్ లభించింది. హిందీ నవలకు బుకర్ ప్రైజ్ రావటం ఇదే మొదటిసారి. టూంబ్ ఆఫ్ శాండ్ ను హిందీ నుంచి ఇంగ్లీష్ లోకి అనువదించిన డైసీ రాక్ వెల్ కు కూడా బహుమతి లభించింది. ఈ ప్రైజ్ కింద రచయిత్రికి 50 వేల పౌండ్లు దాదాపు 49 లక్షల రూపాయలను అందించారు. ఈ బుక్ ను ట్రాన్స్ లేట్ చేసిన ఆథర్ కు చెరి సగం పంచనున్నారు. టూంబ్ ఆఫ్ శాండ్ నవల ఇప్పటికే ఇంగ్లీష్ పెన్ అవార్డు కూడా దక్కించుకుంది. టూంబ్ ఆఫ్ శాండ్ నవల 80 ఏళ్ల మహిళ గురించి ఉంటుంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లడం.. ఆ తర్వాత డిప్రెషన్ నుంచి బయటపడడం, పాకిస్తాన్ వెళ్లడం కథాంశంగా నవల సాగింది. వృద్ధురాలి మానసిక సంఘర్షణ, సమాజం చుట్టూ అల్లుకున్న సమస్యలతో ఈ నవల ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంటుంది. అన్ని ఎంట్రీలను పరిశీలించిన న్యాయనిర్ణేతల బృందం ఈ టూంబ్ ఆఫ్ శాండ్ ను బుకర్ ప్రైజ్ కు ఎంపిక చేసింది. అద్భుతమైన నవల అని కమిటీ ప్రశంసించింది. గీతాంజలి శ్రీ రాసిన పలు నవలు, కథలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, సెర్బియన్, కొరియన్ లాంగ్వేజెస్ లోకి అనువాదం అయ్యాయి.