ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయలను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ గంగ కార్యక్రమం ద్వారా ఇప్పటికే వేలాది మందిని సురక్షితంగా భారత్కు తీసుకురాగా.. ఇప్పటికీ చాలా మంది ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. వీరంతా తినడానికి తిండి, ఉండటానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉక్రెయిన్లో ఇరుక్కుపోయిన కొంతమంది తాము ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ ద్వారా తెలియజేస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో ఈశాన్య నగరమైన సుమీ స్టేట్ యూనివర్సిటీలో చిక్కుకున్న కొంతమంది విద్యార్ధులు తమను రక్షించాలంటూ విజ్జప్తి చేస్తున్నారు. వందలాది మంది ఒకచోట గ్రూప్లా ఏర్పడి తమకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, కరెంట్ కూడా లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఓ విద్యార్ధి మాట్లాడుతూ.. 'మేము ఇక్కడ హాస్టల్స్లో 900 మంది వరకు ఉన్నాం. ఇక్కడ కరెంట్ లేదు. మైనస్ డిగ్రీల చలి ఉంది. తినడానికి తిండి లేదు. తాగడానికి, కనీసం బాత్రూమ్కు కూడా నీళ్లు లేవు. నిన్న రాత్రి తిన్నాం. ఇప్పటి వరకు ఏం తినలేదు. ఖార్కీవ్ వెళ్లడానికి మాకు 4,5 గంటల సమయం పడుతుంది. మళ్లీ ఖార్కివ్ నుంచి హంగేరి సరిహద్దు వరకు వెయ్యి కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్లేందుకు మాకు ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. ఎప్పటి నుంచో మోదీ ప్రభుత్వం మమ్మల్ని రక్షిస్తుందని చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా మమ్మల్ని రక్షించాలని మోదీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మోదీ జీ మమ్మల్ని ఇక్కడి నుంచి బయట పడేయండి. మాకు సాయం చేయండి. లేదంటే మేము ఇక్కడే చచ్చిపోతాం' అంటూ వేడుకున్నారు. దీనిని చూసిన నెటిజన్లు ఈ వీడియో ఉక్రెయిన్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు అద్దం పడుతోందని, వెంటనే వీరికి కేంద్రం సాయం చేయాలని కామెంట్ చేస్తున్నారు.
మోదీ జీ మమ్మల్ని ఇక్కడి నుంచి బయట పడేయండి!
March 04, 2022
0
Tags