ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్పుర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో యోగీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కూడా ఉన్నారు. నామినేషన్ దాఖలు కంటే ముందు అక్కడి గోరఖ్నాథ్ ఆలయంలో యోగీ ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, యోగీ ఆదిత్యనాథ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. యోగీ ఆదిత్యనాథ్ నామినేషన్ దాఖలు కంటే ముందు ఇద్దరు నేతలు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా యూపీ సీఎంను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యోగీని పొగడ్తల్లో ముంచెత్తారు. 'ఉత్తర్ప్రదేశ్ను మాఫియా నుంచి విముక్తి చేసిన ఘనత యోగీ ఆదిత్యనాథ్దే. 25ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సరైన పాలనను తిరిగి అందించారు' అంటూ ప్రశంసించారు. అంతేకాకుండా కొవిడ్ మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేశారని చెప్పుకొచ్చారు. భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేసిన రాష్ట్రంగా ఉత్తర్ప్రదేశ్ను నిలిపారని తెలిపారు. కొవిడ్పై అత్యంత సమర్థవంతంగా పోరాడారని అన్నారు. ఉత్తర్ప్రదేశ్లో గత మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాని వ్యక్తులే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అసెంబ్లీ బరిలో దిగుతున్నట్లు ప్రకటించగానే మాజీ సీఎం అఖిలేష్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తూర్పు యూపీలోని కర్హల్ నియోజక వర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
గోరఖ్పుర్ నుంచి యోగీ నామినేషన్ దాఖలు!
February 04, 2022
0
Tags