చక్రవర్తి

Telugu Lo Computer
0


చక్రవర్తి గా సుపరిచితుడైన సంగీత దర్శక గాయకుడు. చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు.(1936 -2002): వీరు దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు.

చక్రవర్తిది గుంటూరు జిల్లా, పొన్నెకల్లు గ్రామం. 1936 సెప్టెంబరు 8వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్య సొంతవూరు పొన్నెకల్లులో చదివారు. గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ చదివారు. వీరి తల్లిదండ్రులు సంగీత జ్ఞానం కలవారు. ఆ కారణంగా అతనికి సంగీతంపై ఆసక్తి కలిగింది. అతని ఉత్సాహంచూసి తండ్రిగారు గుంటూరులో ఉన్న మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించారు. ఒక పక్క చదువు, మరో పక్క సంగీతాభ్యాసం నిరాటంకంగానే సాగాయి. అతను ఉత్సాహం పట్టలేక వినోద్ ఆర్కెస్ట్రా అనే బృందాన్ని ఏర్పాటు చేసి పాటలు, పద్యాలు పాడుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో 1954-58ల మధ్య కె.అప్పారావు కంఠం పాటలతో ప్రతిధ్వనించేది. నాటి శ్రోతలకి అతని కంఠం బాగా పరిచయం. 1958లో బి.ఏ.లో డిగ్రీ తీసుకున్నా, హిందీ పరీక్షలో విశారదుడైనా ఉన్న ఉత్సాహం సంగీతాన్ని ఎన్నుకున్నాడు, నమ్ముకున్నాడు కానీ ఉద్యోగ ప్రయత్నం మాత్రం చేయలేదు. తన మేనమామ కుమార్తె అయిన రోహిణి దేవిని వివాహం చేసుకొని 1958లో కుటుంబంతో మద్రాసు చేరారు. దర్శకుడిగా రాణించిన కొమ్మినేని శేషగిరిరావు చక్రవర్తి గారి తమ్ముడే. చక్రవర్తి రెండవ కుమారుడు శ్రీ కూడా తెలుగు సినిమా సంగీతకారుడిగా విశేషంగా రాణించారు. అప్పారావు మద్రాసు వచ్చి హెచ్.ఎమ్.వి. వారికి గ్రామఫోను పాటలు పాడటం మొదలుపెట్టారు. ఒక రికార్డింగులో సంగీతదర్శకులు రాజన్, నాగేంద్రలు అవకాశం ఇప్పించి పాడించారు. బి.విఠలాచార్య ఆప్పారావుకి తన సినిమా జయ విజయ (1959)లో ఆడాలి ... పెళ్ళాడాలి అనేపాటను పాడించారు, ఆ పాటను చిత్రంలో హాస్యనటుడు బాలకృష్ణ పాడతారు.ఇదే అప్పారావు సినిమాలలో పాడిన మొదటి పాట. ఆ కాలంలో అనువాద చిత్రాలు ఎక్కువగా ఉండేవి, అందులో అప్పారావుకి అవాకాశాలు వచ్చాయి, నాటకాలలో అనుభవం ఉండడం చేత అతను సంభాషణలను బాగా చెప్పగలిగారు. ఈ విధంగా అప్పారావు పాటలు పాడడంతో పాటు అనువాద చిత్రాలలో పాత్రలకు గాత్రం అందించటం మొదలుపెట్టారు. అతని కంఠం, చెప్పే విధానం బాగా ఉండడంతో హీరో పాత్రలకు గాత్రదానం చేసే స్థాయికి ఎదిగారు. అతను ఎం.జి.రామచంద్రన్, జయశంకర్, జెమిని గణేశన్ లకు గాత్రం అందించారు. హాస్యనటులైన నగేష్, కులదైవం రాజగోపాల్ లకూ అతను గాత్రదానం చేసారు. ముఖ్యంగా అతను నగేష్ కు  బాగా డబ్బింగు చెప్పేవారు. అప్పారావు సినిమాలలో 200లకు పైగా పాటలు పాడారు. కొన్ని కలిసి పాడినవి ఐతే, కొన్ని యుగళ గీతాలు. పరమానందయ్య శిష్యుల కథ (1966)లో ఘంటసాలతో పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా అనే పాటను పాడారు. బంగారు సంకెళ్ళు (1968)లో రాజబాబుకి తొలగండెహే అనే తాగుడు పాటని పాడారు. నిలువు దోపిడి (1968)లో ఎన్.టి.రామారావుకి ఒక పద్య చదివినప్పుడు, నాగార్జున పద్యాలు, శ్లోకాలు చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. ఫలోమా అనే మలయాళ చిత్రం హిందీ దబ్బింగుకి వచ్చింది, దానికి అప్పారావుని సంగీత దర్శకునిగా తీసుకున్నారు. టైటిల్స్‌లో అన్నీ హిందీ పేర్లే ఉన్నాయి, వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకని సినిమావారు అతనుకు చెప్పి చక్రవర్తిగా వేశారు. మూగ ప్రేమ (1970) చిత్రంకి అతను సంగీత దర్శకత్వం వహించారు, అందులోనూ చక్రవర్తి పేరు ఖాయమైంది. ఈ విధంగా అప్పారావు చక్రవర్తిగా మారారు.మూగ ప్రేమలో పాటలు బాగున్నాయి అని పేరు వచ్చిన తరువాత, భలే గూఢచారి (1970), తల్లీ కూతుళ్ళు (1971)లకు సంగీత దర్శకత్వం వహించారు. మూగ ప్రేమలో ఈ సంజెలో..., నాగులేటి వాగులోన... పాటలు పేరు తెచ్చినట్లు, తల్లీ కూతురు పాటలు కూడా పేరు తెచ్చాయి. అయినా అతను అంతగా పేరు తెచ్చుకోలేదు. కొంత కాలం ప్రయత్నాలు అటూ-ఇటూ సాగాయి. వీటి మధ్య దర్శకుడు సి.ఎస్.రావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరి నిలువు దోపిడి, మళ్ళీపెళ్ళి, కంచుకోట, పెత్తందార్లు సినిమాలకు పనిచేశారు. మధ్య మధ్యలో తనకి ఇష్టమైన శాఖ సంగీతాన్ని విడవకుండా పాటలూ పాడేవారు.శారద చిత్రంతో సినీ రంగంలో స్థిరపడ్డారు. అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాభిషేకం, ఎన్.టి.రామారావు‌తో కొండవీటి సింహం వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించి 850 తెలుగు చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 1977 లో వచ్చిన యమగోల తో మంచి పేరు పొందారు. 1989 లో తెలుగులో 95 సినిమాలు విడుదల అయితే  వాటిలో 66 చిత్రాలకు చక్రవర్తి గారే సంగీతాన్ని కూర్చటం ప్రపంచ చిత్ర పరిశ్రమలోఒక రికార్డ్. చక్రవర్తి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. చివరిసారిగా నిన్నే ప్రేమిస్తా చిత్రంలో సౌందర్య నాన్నగా నటించారు. దాదాపు 600 చిత్రాలకు డబ్బింగ్ కూ డా చెప్పారు. అమ్మోరు చిత్రానికి చివరి సారిగా సంగీతాన్ని అందించిన చక్రవర్తి 2002 ఫిబ్రవరి 3న కన్నుమూశారు. నేటి భారతం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది బహుమతిని అందుకున్నారు. వీరి శిష్యుడు ఏ.ఆర్.రెహమాన్ ఆస్కార్ అవార్డు పొందారు.చక్రవర్తి రెండవ కుమారుడు అయిన శ్రీ సినీ సంగీత రంగంలో పనిచేస్తున్నారు. భారత తపాలశాఖ వారు గుంటూరులో 2014 సెప్టెంబర్ 9న చక్రవర్తి గారిపై ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)