ధర్మవరపు సుబ్రహ్మణ్యం

Telugu Lo Computer
0


ధర్మవరపు సుబ్రహ్మణ్యం తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించారు. స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం .వామపక్షభావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గతంలో ప్రజా నాట్యమండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు. దూరదర్శన్లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు పొందారు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్రతో ప్రముఖస్థానంలో కొనసాగారు. దర్శకునిగా (తోకలేని పిట్ట) కూడా కొంత ప్రయత్నం చేశారు. ఆయన 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసారు.2004 నుండి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగారు . ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20 న ప్రకాశం జిల్లా లోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.చిన్నప్పుడే తండ్రి చనిపోతే నలుగురు పిల్లలను ఆయన తల్లే పెంచి పెద్ద చేసింది. ఉన్నత పాఠశాల విద్యను అద్దంకిలోనూ, ఇంటర్ ఒంగోలు సి.ఎస్.ఆర్ శర్మ కళాశాలలోనూ చదివారు. ఆ దశలోనే ఆయనకు ప్రజానాట్యమండలితో పరిచయం ఏర్పడింది. నాటకాల మీదే ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇంటర్లో ఉత్తీర్ణులు కాలేదు. అమ్మ బాధ చూసి మళ్ళీ పట్టుదలగా సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. తరువాత బీకాంలో చేరినా ఆయన మనసు సినిమాల వైపే ఉండేది. ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడ అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ సొంత ఊరుకు తిరిగి వచ్చారు. మద్రాసు నుండి తిరిగి వచ్చి కొన్నాళ్ళు వ్యవసాయ పనుల్లో ఉండగా కొందరు మిత్రుల సలహా మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు.అందులో ఉత్తీర్ణుడవడంతో హైదరాబాద్ లోని పంచాయితీ రాజ్ శాఖలో అధికారిగా ఉద్యోగం వచ్చింది. అక్కడ కొద్ది కాలం కుదుట పడ్డాక ఆయన దృష్టి మళ్ళీ నాటకాల వైపు మళ్ళింది. తరువాత ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు రాశారు. తరువాత దూరదర్శన్ లో తొలి తెలుగు ధారావాహిక అనగనగా ఒక శోభను ప్రారంభించారు.  ఆ తరువాత మనసు గుర్రం లేదు కళ్ళెం, పరమానందయ్య శిష్యుల కథ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆనందో బ్రహ్మతో ఆయన తెలుగువారందరికీ చిరపరిచితుడయ్యారు. దూరదర్శన్ లో ఉండగానే ఆయనకు జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురాలో అవకాశం వచ్చింది. దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి. నటనలో తలమునకలై ఉండగానే తోక లేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా ఆశించనంతగా ఆడకపోవడంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతల జోలికి పోలేదు. నువ్వు నేను, ధైర్యం చిత్రాల మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్ర వేసి నవ్వించారు. అయితే ఆ పాత్రలను కించ పరిచే విధంగా మలుస్తూ ఉండటంతో క్రమంగా ఆ పాత్రలకు దూరమయ్యారు. ఆయన నట ప్రస్థానంలో ఒక్కడు సినిమాలో చేసిన పాస్‌పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆయన నటించిన చివరి సినిమా ప్రేమాగీమా జాంతానై విడుదల కావాల్సి ఉంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్‌లో జరిగిన షూటింగ్‌కు హాజరైనారు.1989 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు సాంస్కృతిక మండలి అధ్యక్షడిగా పనిచేశారు. ఆయనకు భార్య కృష్ణజ, ఇద్దరు కుమారులు రోహన్ సందీప్, రవిబ్రహ్మతేజ ఉన్నారు. దిల్‌షుక్ నగర్ లోని శారదానగర్ లో ఆయన 1979 నుండి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.పెద్ద కుమారుడు సందీప్ వ్యాపార రంగంలో స్థిర పడగా చిన్న కుమారుడు రవిబ్రహ్మ తేజ చదువుతున్నారు. ఆరు నెలలుగా కాలేయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 7, 2013 శనివారం రాత్రి 10.30 గంటలకు చైతన్యపురిలోని గీతా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)