ఒక పేషెంట్ రీ చెక్ అప్ కు వచ్చింది. ఆమె వయస్సు 40 ఏళ్ళు.
"షుగర్ మాత్రలు వేసుకుంటున్నావా ?" అనడిగాను.
"అస్సలు మానలేదండీ ! మీరు చెప్పినట్లే వేసుకుంటున్నాను. ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నానండీ !"
తీరా చుస్తే షుగరు 376 % ఉంది.
"నాకు అనుమానం ఏమీ అనిపించలా ! ఎక్కడో ఆహారంలోనే తేడా వచ్చిందని !!"
ప్రశ్నించగా, ప్రశ్నించగా తేలిందేమంటే మామిడి పళ్ళు రోజుకి నాలుగు ఐదు చొప్పున వారం రోజులుగా తింటున్నదట!.
"మరి ఇకనేం ? అందుకే అంతగా పెరిగింది. ఎక్కువగా గుజ్జు ఉన్న పళ్ళు తినద్దని చెప్పాను కదా?"
"కానీ డాక్టర్ గారూ ! అవి చెట్టు పళ్ళండీ !"
"ఆహాఁ ! చెట్టుకి కాకుండా ఫాక్టరీల్లో తయారౌతాయా ఏమిటి ?" వెటకారం ఆపుకుందామనుకున్నా ఆగలేదు.
"మా పెరటి చెట్టండీ !"
"అయితే ?"
"మందులేమీ వెయ్యకుండా పెంచామండీ ! పౌడర్ వెయ్యకుండా గడ్డిలో పరిచి పండబెట్టామండీ "
"ఐతే ఏమిటటా ?"
"ఇంట్లో సహజంగా పండించిన పళ్ళు తింటే షుగర్ పెరగదని వాట్సాప్ లో మెసేజి పెట్టారండీ మూణ్ణెల్ల క్రితం !"
హా ! ఢ్డామ్ మ్ మ్ మ్ !
డాక్టర్ గారూ, డాక్టర్ గారూ ! ఏమైందండీ ??