నాంపల్లి కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య !

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో నాంపల్లి కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబర్‌పేట బతుకమ్మకుంటలోని పోచమ్మ బస్తీలో శ్రీనిధి రెసిడెన్సీలో నివాసముండే మెజిస్ట్రేట్ మణికంఠ(36) తన నివాసంలోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘట్‌కేసర్ మండలం ముత్తువెల్లి గ్రామానికి చెందిన మణికంఠ నాంపల్లి కోర్టులో స్పెషల్ జడ్జీ ఫర్ ఎక్సైజ్ కేసెస్ కు సంబంధించి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. కాగా, మణికంఠ ఏడు సంవత్సరాల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన లలితతో వివాహం జరిగింది. అయితే, రెండు సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వివాదాలతో కొంత కాలం నుంచి మణికంఠ భార్య లలిత పుట్టింట్లోనే ఉంటోంది. లలితతో జరిగిన మనస్పర్థల కారణంగానే మణికంఠ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)