వీవీప్యాట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యక్తం చేసిన ఆందోళనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. జైరాం లేవనెత్తిన అనుమానాల్లో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అంశాలేవీ లేవని ఇసీ పేర్కొంది. వీటికి తోడు వీవీప్యాట్ స్లిప్లను 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే ప్రవేశ పెట్టిందని గుర్తుచేసింది. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్కు ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ శర్మ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణ నియమావళి 1961లోని 49ఏ, 49ఎం నిబంధనల కింద వీవీప్యాట్లు, పేపర్ స్లిప్లను ఆగస్టు 14, 2013లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశ పెట్టిందని అందులో పేర్కొన్నారు. ఈవీఎంల వినియోగంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా అందుబాటులో ఉంచిన 'తరచూ అడిగే ప్రశ్నలు' మరింత స్పష్టతనిస్తాయన్నారు. ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని విపక్ష కూటమి 'ఇండియా' ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. వీవీప్యాట్ స్లిప్లను ఓటర్లకు అందించాలని, ఆ తర్వాత వాటిని వంద శాతం లెక్కించాలని డిమాండు చేస్తోంది. ఢిల్లీలో ఇటీవల జరిగిన కూటమి సమావేశంలోనూ ఇదే అంశంపై ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇండియా కూటమి బృందానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కేంద్ర ఎన్నికల సంఘానికి డిసెంబర్ 30న లేఖ రాశారు. దీనికి ఈసీ ఈ విధంగా బదులిచ్చింది.
వీవీప్యాట్లను కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది !
January 05, 2024
0
Tags