రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా వైద్య విద్యలో సీటు సంపాదించాలనే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థిని తనువు చాలించింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన నిషా యాదవ్ (21) అనే విద్యార్థి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరియా జిల్లాకు చెందిన నిషా కోటాలోని మహవీర్ నగర్ ప్రాంతంలో ఓ హాస్టల్లో ఉంటూ మెడికల్ పరీక్ష నీట్ కోసం ప్రిపేరవుతోంది. ఈ క్రమంలో గత నెల 29వ తేదీన రాత్రి నిషా తండ్రి ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చెయ్యలేదు. గురువారం మరోసారి కాల్ చేసినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. ఆందోళన చెందిన నిషా తండ్రి హాస్టల్ యాజమాన్యానికి ఫోన్ చేయగా.. వారు నిషా రూమ్కు వెళ్లారు. ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తెరవకపోవడంతో డోర్స్ పగలగొట్టి లోపలికెళ్లి చూశారు. అక్కడ నిషా ఫ్యాన్కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న కోటా పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, కోటాలో జిల్లా యంత్రాంగం తప్పనిసరి చేసిన యాంటీ హ్యాంగింగ్ పరికరాన్ని నిషా గదిలో అమర్చలేదని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సోమవారం కూడా ఓ నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్కు చెందిన 20 ఏళ్ల ఫౌరీద్ హుస్సేన్ తన రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కోటాలో ఉరేసుకొని మరో యువతి ఆత్మహత్య !
December 01, 2023
0
Tags