రాజస్థాన్ లో బీజేపీ కనిపించకుండా మాయం అవ్వడం ఖాయం !

Telugu Lo Computer
0


ప్రధాని మోడీ తనపై చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ ''ఈసారి మాయాజాలం తప్పకుండా పని చేస్తుంది. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ మాయం అవుతుందని మోడీ చెప్పారు. కానీ ఎవరు మాయం అవుతారో మేం చెప్తాం'' అని విరుచుకుపడ్డారు. కన్హయ్య లాల్ హత్య కేసును ఎన్నికల అంశంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డ ఆయన  హంతకులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. నిందితులకు ఈపాటికే ఉరి తీయాల్సిందని, కానీ ఎన్నికల దృష్ట్యా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టిన విచారణ ముందుకు సాగడం లేదని, అందుకే ఈ కేసు ఆలస్యమవుతూ వస్తోందని దుయ్యబట్టారు. రాజస్థాన్ పోలీసులు ఈ కేసుని డీల్ చేసి ఉంటే, ఈ పాటికే కేసు తుది దశకు చేరుకునేదని అన్నారు. కన్హయ్య లాల్ ఘటన జరిగిన వెంటనే రాజస్థాన్ పోలీసులు రెండు గంటల్లోనే నిందితుల్ని అరెస్టు చేశారని, కానీ ఈ కేసుని ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుందని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కలిసి మతపరమైన అల్లర్లు జరకుండా పని చేస్తారని తాను ఊహించానన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను వెంటనే తన కార్యక్రమాలను రద్దు చేసుకొని, కేసుపై పూర్తి దృష్టి పెట్టానన్నారు. కానీ బీజేపీ నాయకులు మాత్రం హైదరాబాద్‌లో సమావేశానికి వెళ్లారని గుర్తు చేశారు. ప్రస్తుతం అస్సాం గవర్నర్‌గా ఉన్న గులాబ్ చంద్ కటారియా అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ కేసులో ఎన్‌ఐఏ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తమకు చెప్పడం లేదని కన్హయ్య లాల్ కుటుంబం చెబుతోందని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగ బీజేపీ లేవనెత్తిన 'రెడ్ డైరీ' ఇష్యూ ఏమాత్రం అర్థం లేనిదని అశోక్ గెహ్లాట్ అభివర్ణించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకల పాల్పడిందని వాళ్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తిప్పికొట్టారు. ఒకవేళ వాళ్లు చేస్తున్న ఆరోపణల్లో ఏదైనా వాస్తవం ఉంటే అప్పుడు ఆ రెడ్ డైరీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) లేదా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈసారి కూడా తమ కాంగ్రెస్ పార్టీనే రాజస్థాన్‌లో అఖండ విజయం సాధిస్తుందని, డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వచ్చాక బీజేపీ ఈ రాష్ట్రం నుంచి కనిపించకుండా మాయం అవ్వడం ఖాయమని అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)