'క్యాష్ బ్యాక్' ఇచ్చిన మహిళా ఓటరు !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో ఓ మహిళకు రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శాంతి ధరివాల్ రూ.25వేలు ఇచ్చి, అందరూ పంచుకోమని సూచించారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో ఆ మహిళ ఇంట్లోకి వెళ్లి మళ్లీ బయటికొచ్చి రూ.25వేలు తీసుకోవాలని మంత్రిని కోరింది. అందరూ చూస్తుండగానే ఈ మాటలు చెప్పింది. ఈక్రమంలో అక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఈ టైంలో ఆ ముచ్చట ఎందుకు చెబుతున్నావని మహిళను నిలదీశాడు. మంగళవారం రోజు రాజస్థాన్‌లోని కోట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. రూ.25వేలు తిరిగి ఇచ్చేసిన మహిళ నిజాయితీని నెటిజన్లు అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో చివరకు ప్రధాని మోడీ దీనిపై మాట్లాడారు. ''కళంకిత నేతల చర్యలను దేశం మొత్తం చూస్తోంది. డబ్బుతో ఒక తల్లిని ప్రలోభపెట్టి ఓటు కొనేందుకు యత్నించారు. ఈ డబ్బును వెనక్కి ఇచ్చి ఆ మహిళామణి ఆ నాయకుడికి గట్టి సమాధానమే చెప్పింది. ఆ మహిళకు నా అభినందనలు'' ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అనంతరం ఇలాంటి మరో వీడియో రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై అంతటా చర్చ జరగడం మొదలయ్యాక రూ.25వేలు వెనక్కి ఇచ్చేసిన మహిళదే మరో వీడియో బయటకు వచ్చింది. అందులో ''రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ ఇచ్చిన రూ.25వేలు ఓట్ల కోసం కాదు. ఆలయం విగ్రహాలు కొనేందుకు ఆ డబ్బులు ఇచ్చారు. మాకు రూ.50 వేలు అవసరమని చెప్పాం. ఆయన రూ.25వేలు ఇచ్చారు'' అని ఆ మహిళ పేర్కొంది. అనంతరం కాంగ్రెస్ నేతల నుంచి ఏదైనా ఒత్తిడి రావడం వల్ల ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకొని ఈవిధంగా చెప్పి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)