కర్ణాటక లోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇదే సమయంలో అనేక జిల్లాల్లో డెంగీ జ్వరాలు క్రమేపీ పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి ఇంతవరకు 3వేల మందికి పైగా డెంగీ జ్వరాలతో అలమటిస్తూ ఆసుపత్రుల్లో చేరారని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. రాజధాని బెంగళూరు నగరంలో సుమారు 900 మందికి డెంగీ సోకినట్లు ఆయన తెలిపారు. డెంగీ జ్వరాల విషయంలో విజయపుర రెండో స్థానంలో ఉంది. డెంగీ వైరస్ 1తో పెద్దగా ప్రాణాపాయం ఉండదని అయితే వైరస్ 2తో మాత్రం ఇబ్బందేనని ఆయన వివరించారు. డెంగీ బారిన పడ్డవారిలో హఠాత్తుగా తీవ్ర జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు, కడుపునొప్పి ఒళ్ళంతా నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. వర్షాకాలం కావడంతో ఇంటి చుట్టు పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలని దీనివల్ల దోమలు వృద్ధి చెందుతాయన్నారు. వర్షాకాలం పూర్తయ్యేంత వరకు దోమల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ జ్వరం వల్ల దేహంలో నీటి ప్రమాణం గణనీయంగా తగ్గిపోయి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంటుందన్నారు. కాగా వర్షాలు అధికంగా పడుతున్న కోస్తా జిల్లాల్లో ఇప్పటికే ఆరోగ్య శాఖ ర్యాపిడ్ టెస్టింగ్ బృందాలను రంగంలోకి దించిందన్నారు. డెంగీతో ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే అప్రమత్తత పాటించాలని సదరు అధికారి వివరించారు. కాగా రాజధాని బెంగళూరు నగరంలో గత 12 రోజుల అవధిలోనే 178 డెంగీ కేసులు నమోదైనట్లు బీబీఎంపీ ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. https://t.me/offerbazaramzon
కర్ణాటకలో 'డెంగీ' జ్వరాలు !
July 14, 2023
0
Tags