తెలంగాణలో నాలుగు రోజులపాటు జోరు వానలు

Telugu Lo Computer
0


తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఆదివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. అక్కడక్కడ చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత కూడా పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. దీంతో నగరం చల్లబడింది. అంతేకాకుండా ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతంగా మారింది. దీంతో ఎండల నుంచి కొంచెం ఉపశమనం కలిగించినట్లయింది. ప్రజలకు ఎండల నుంచి ఈ వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. రైతులకు మాత్రం వేదననే మిగుల్చుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు కురిసన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ఇప్పుడు మరోసారి వర్షాలంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)