కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించిన మరికొన్ని పార్టీలు

Telugu Lo Computer
0


న్యూఢిల్లీలో ఈనెల 28న జరుగనున్న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్టు రాష్ట్రీయ జనతా దళ్, డీఎంకే, శివసేన, ఎన్‌సీపీ  బుధవారంనాడు ప్రకటించాయి. టీఎంసీ, సీపీఐ, ఆప్ ఇప్పటికే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లేదని ప్రకటించాయి. కాంగ్రెస్ సహా మరిన్ని విపక్ష పార్టీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలంటూ విపక్షాలు బలంగా డిమాండ్ చేస్తుండగా, ఈ అంశంపై భావసారూప్యం కలిగిన విపక్ష పార్టీలన్నీ చర్చించి ఆ పార్టీల ఫ్లోర్ లీడర్లు సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ విషయమై ఆర్జేడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ, పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధానమంత్రి ప్రారంభించనుండటం రాజ్యాంగ విరుద్ధమని, ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్ చేయడం ద్వారా విపక్షాలు ఐక్య సందేశం ఇవ్వనున్నాయని చెప్పారు. ఈనెల 28న జరిగే పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్నీ విపక్షాలన్నీ నిర్ణయించినట్టు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ బుధవారంనాడు మీడియాకు తెలిపారు. తాము అదే పని చేస్తున్నామని చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. పార్లమెంటు భవన ఆవిష్కర కార్యక్రమానికి ఆర్జేడీ దూరంగా ఉంటుందని ప్రకటించారు. మరోవైపు, భావసారూప్యం కలిగిన విపక్ష పార్టీల నిర్ణయానికి అనుగుణంగా తాము పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ఎన్‌సీపీ ప్రకటించింది. డీఎంకే సైతం బాయ్‌కాట్ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ ఎంపీ తిరుచ్చి శివ మీడియాకు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)